
చాంగ్జౌ: ఇండియా డబుల్స్ స్టార్ ప్లేయర్లు సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జోడీ.. చైనా ఓపెన్ సూపర్–1000 టోర్నీలో సెమీస్తోనే సరిపెట్టుకున్నారు. శనివారం జరిగిన మెన్స్ డబుల్స్లో అన్సీడెడ్ సాత్విక్–చిరాగ్ 13–21, 17–21తో రెండోసీడ్ ఆరోన్ చియ్–సో వుయ్ యిక్ (మలేసియా) చేతిలో ఓడారు. గతంలో వీళ్లతో తలపడిన 14 మ్యాచ్ల్లో ఇండియన్ ద్వయం కేవలం మూడుసార్లే నెగ్గింది. 42 నిమిషాల మ్యాచ్లో తొలి గేమ్లో సాత్విక్–చిరాగ్ తేలిపోయారు. 4–4తో స్కోరు సమమైన తర్వాత ఏ దశలోనూ తేరుకోలేకపోయారు. ఆరోన్–యిక్ వరుసగా పాయింట్లు నెగ్గి ఒత్తిడి పెంచారు.
ఇక రెండో గేమ్ ఆరంభంలో దూకుడుగా ఆడిన సాత్విక్–చిరాగ్ 5–4తో ముందంజ వేశారు. కానీ క్రాస్ కోర్టు ర్యాలీస్ అద్భుతంగా కొట్టిన ఆరోన్ వరుసగా 4 పాయింట్లు గెలిచి 8–5 లీడ్ను అందించాడు. అదే జోరుతో 16–12 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే పవర్ఫుల్ స్మాష్లతో చెలరేగిన ఇండియన్ జోడీ వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి 16–16తో స్కోరు సమం చేశారు. ఈ టైమ్లో వ్యూహాత్మకంగా ఆడిన మలేసియన్ జంట వరుసగా మూడు, రెండు పాయింట్లతో గేమ్, మ్యాచ్ను సొంతం చేసుకుంది.