
సీఎం కేసీఆర్ వల్లే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో కొనసాగుతోన్న ప్రభుత్వం సుపరిపాలన చూసి పక్క రాష్ట్రాల ప్రజలు బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపుతున్నారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ కూడా మూడోసారి సీఎం కావడం ఖాయమన్నారు. రాబోయే ఎన్నికల్లో కార్యకర్తలంతా ప్రజా క్షేత్రంలో ఉంటూ బీఆర్ఎస్ పార్టీ సత్తా చూపించాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసికెళ్లి విస్తృత ప్రచారం కల్పించాలని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాల కుట్రలను తిప్పి కొట్టాలన్నారు. తనకు అడగకుండానే సీఎం కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చారని, గిరిజన మంత్రిగా ఈ రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో తన భాగస్వామ్యం ఉండడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. నాలుగు శాతం గా ఉన్న గిరిజన రిజర్వేషన్ ను 10 శాతానికి పెంచిన ఘనత కేసీఆర్ గారికే దక్కుతుందని చెప్పారు.