స్పీకర్ కు సుప్రీం నోటీసులు

స్పీకర్ కు సుప్రీం నోటీసులు
  • పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో ఏలేటి పిటిషన్​పై విచారణ
  • ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు  
  • దాఖలు చేసిన ఇతర పిటిషన్లతో జత చేసిన బెంచ్​

న్యూఢిల్లీ, వెలుగు:  పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్​పై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్​కు సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. కారు గుర్తుపై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారని, వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డితో సహా పలువురు గతేడాది జనవరిలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అందులో వాదనలు జరుగుతుండగానే మార్చి 18న దానం నాగేందర్ ను ప్రతివాదిగా చేరుస్తూ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పెషల్ లీవ్ పిటిషన్ (సివిల్) దాఖలు చేశారు. వీటన్నింటిపై గతంలో సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. గత ఏడాది జూలై 31 వరకు ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించారు. 

అయితే.. స్పీకర్ కార్యాలయం మరింత సమయం కావాలని సుప్రీంకోర్టును కోరింది. మరోవైపు బీఆర్ఎస్ నేతలు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్​పై సుప్రీంకోర్టు విచారణ జరిపి నాలుగు వారాల సమయం ఇస్తూనే.. తీసుకుంటున్న చర్యలపై రెండు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. ఇదిలా ఉండగా.. గత సీజేఐ బెంచ్ ఆదేశాలను పాటించని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని ఏలేటి ఈ నెల 11న సుప్రీంకోర్టులో కంట్మెంట్ పిటిషన్ వేశారు. ఈ వ్యవహారంలో పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌‌‌‌ వివరాలను పొందుపరిచారు. తాజాగా దానం నాగేందర్ మీడియాలో చేసిన కామెంట్లను ఈ పిటిషన్‌‌‌‌లో ప్రస్తావించారు. తాను ఇంకా కాంగ్రెస్‌‌‌‌లోనే ఉన్నానని దానం చేసిన వ్యాఖ్యలను జోడించారు. ఈ పిటిషన్  సోమవారం జస్టిస్‌‌‌‌ సంజయ్‌‌‌‌ కరోల్‌‌‌‌ నేతృత్వంలోని జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్ ద్విసభ్య ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ఏలేటి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. సుప్రీం ఆదేశాలు పాటించని స్పీకర్ పై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని కోరారు. దీనిపై జస్టిస్ ఏజీ మసీహ్ స్పందిస్తూ.. ఇతరులు (బీఆర్ఎస్) దాఖలు చేసిన పిటిషన్లతో ఈ ధిక్కరణ పిటిషన్ ను ట్యాగ్ (జత) చేస్తున్నట్లు తెలిపారు. అలాగే స్పీకర్ కు నోటీసులు జారీ చేశారు. కాగా.. ఈ పిటిషన్ పై మార్చి 9న మరోసారి విచారణ జరిపే అవకాశం ఉన్నట్లు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ కేసుల జాబితాలో చేర్చింది.