
బషీర్బాగ్, వెలుగు: ఓ వ్యక్తి ఫ్రెండుకు తాను స్నేహితుడినని నమ్మించి సైబర్ నేరగాళ్లు డబ్బులు కొట్టేశారు. సైబర్ క్రైం ఏసీపీ శివమారుతి తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన 27 ఏళ్ల వ్యక్తికి సైబర్ నేరగాళ్లు వాట్సాప్ లో మెసేజ్ చేశారు. ‘మీ ఫ్రెండుకు నేను ఫ్రెండుని, నేను లండన్లో ఉంటున్నా’ అని చెప్పారు. మా ఫ్రెండు ఫోన్ పనిచేయడం లేదు, అందుకే నీకు ఫోన్ చేశామని కథ అల్లారు.
లండన్ నుంచి హైదరాబాద్ వస్తున్నానని, ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో ఫారిన్ కరెన్సీ ఉండటం వల్ల ఇన్ కం టాక్స్ అధికారులు నిలిపివేశారని మాయమాటలు చెప్పారు. కాసేపటికి మరో నెంబర్ నుంచి ఇన్ కం ట్యాక్స్ అధికారి పేరుతో ఫోన్ చేశారు. ఫారిన్ కరెన్సీ తెచ్చినందుకు క్లియరెన్స్ , టాక్స్ చార్జెస్ రూ.55,500 చెల్లించాలని సూచించారు. ఇండియన్ కస్టమ్స్, ఇన్ కం ట్యాక్స్ కు సంబంధించి ఫేక్ లెటర్ ను పంపించారు.
దీంతో వారి మాటలను నమ్మిన బాధితుడు ఆ డబ్బులను బాధితుడు బదిలీ చేశాడు. మళ్లీ రూ.లక్షా 50 వేలు పంపించాలని కోరడంతో ట్రాన్స్ఫర్ చేశారు. మరోసారి రూ.3 లక్షల 50 వేలు పంపాలనడంతో బాధితుడు తన ఫ్రెండ్ కు ఫోన్ చేయడంతో మోసం జరిగినట్లు తెలిసింది. అప్పటికే రూ.2,05,500 పోగొట్టుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.