
తెలంగాణలో పాఠశాలల పునఃప్రారంభానికి కౌంట్డౌన్ ప్రారంభం అయింది. 2023 జూన్ 12 సోమవారం రోజు నుంచి స్కూళ్లు రీ ఓపెన్ కానున్నాయి. అంటే వేసవి సెలవులకు ఇంకా రెండు వారాల సమయం మాత్రమే ఉన్నాయన్న మాట. దాదాపు రెండు నెలల పాటు విద్యార్థులు సమ్మర్ హాలీడేస్ ను ఎంజాయ్ చేశారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో విద్యార్థులు తమ సొంత పట్టణాలకు చేరకుంటున్నారు.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE)కి అనుబంధంగా ఉన్న పాఠశాలలు ఇప్పటికే మార్చి, ఏప్రిల్ నెలల్లో 2023-24 విద్యా సంవత్సరాన్ని ప్రారంభించగా, రాష్ట్ర బోర్డుచే గుర్తింపు పొందిన పాఠశాలలు జూన్ 12 నుండి విద్యా సంవత్సరాన్ని ప్రారంభిస్తాయి. కాగా స్కూళ్లకు 2023 ఏప్రిల్ 25 నుంచి వేసవి సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఇదిలావుండగా జూన్ 1 నుండి 9 వరకు ప్రభుత్వ పాఠశాలల్లో బడి బాట (అడ్మిషన్ డ్రైవ్) నిర్వహించాలని విద్యా శాఖ యోచిస్తోంది. ఇందులో భాగంగా ఉపాధ్యాయులు ఇంటింటికీ ప్రచారం నిర్వహించి బడి మానేసిన పిల్లలను గుర్తించి వారిని బడిలో చేర్పించాల్సి ఉంటుంది. బడి మానేసిన పిల్లలు లేదా చదువు మానేసిన విద్యార్థులను కూడా గుర్తించి వారి వయస్సు ప్రకారం తగిన తరగతిలో పాఠశాలల్లో చేర్పిస్తారు.
మరోవైపు 2023 జూన్ 12 నుంచి 20 వరకు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్టియర్ విద్యార్థులకు, మధ్యాహ్నం 2 : 30 గంటల నుంచి సాయంత్రం 5 : 30 గంటల వరకు సెకండియర్ వారికి పరీక్షలు నిర్వహించనున్నారు.