
వ్యవసాయ సైంటిస్ట్గా పదిహేడేండ్ల అనుభవం.. బాగా జీతం వచ్చే ప్రభుత్వ ఉద్యోగం.. అయినా కామిని సింగ్కి సంతృప్తి లేదు. రైతుల కోసం ఇంకా ఏదో చేయాలనే తపన మాత్రం ఉండేది. అందుకే ల్యాబ్ని వదిలి పొలాల్లోకి వెళ్లింది. దాదాపు వెయ్యి మందికి పైగా రైతులను సేంద్రియ పద్ధతిలో మునగ సాగు చేసేలా ప్రోత్సహించింది. రూ. 9 లక్షలతో మొదలుపెట్టిన తన స్టార్టప్ని ఇప్పుడు రూ. 1.75 కోట్ల విలువైన బిజినెస్గా మార్చింది.
కామిని సింగ్.. సైంటిస్ట్గా తన ప్రయాణంలో ఎన్నో రీసెర్చ్లు చేసింది. దేశంలోని కొన్ని ప్రముఖ పరిశోధనా సంస్థల్లో పనిచేసింది. ముఖ్యంగా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సబ్ ట్రాపికల్ హార్టికల్చర్ (సీఐఎస్హెచ్), సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్ (సీఐఎంఏపీ) ఉద్యానవన రంగంలో ఎంతో అనుభవాన్ని సంపాదించింది. ఆమె సేంద్రియ వ్యవసాయ విధానంపై పట్టు సాధించింది.
ఇలా ఎన్నో విజయాలు సాధించినప్పటికీ ఆమె ఎప్పుడూ ఏదో కోల్పోతున్నాననే భావనలో ఉండేది. అందుకే రైతులకు మరింత దగ్గర కావాలనే తపనతో ఉద్యోగం వదిలి పీహెచ్డీలో చేరింది. అప్పుడే తనలాంటి సైంటిస్ట్లు చేసిన పరిశోధనల ఫలితాలు రైతులకు పెద్దగా చేరడం లేదని తెలుసుకుంది. అప్పుడామెకు వచ్చిన ఒక చిన్న ఆలోచన.. ఆమె కెరీర్ని పూర్తిగా మార్చేసింది.17 సంవత్సరాల పరిశోధనా అనుభవం ఉన్న కామినిని ప్రయోగశాల వదిలి ఉత్తరప్రదేశ్లోని గ్రామీణ రైతుల దగ్గరకు చేర్చింది.
తక్కువ పెట్టుబడి.. ఎక్కువ దిగుబడి
పీహెచ్డీ చేస్తున్నప్పుడే 2016–17లో కామిని సింగ్కు ఉత్తరప్రదేశ్లో ఒక ప్రాజెక్ట్ను లీడ్ చేసే అవకాశం వచ్చింది. సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసే విధంగా రైతులకు ప్రోత్సాహం, శిక్షణ ఇవ్వడమే ఆ ప్రాజెక్టు లక్ష్యం. “ఎవరైనా సేంద్రియ వ్యవసాయం మొదలుపెట్టిన మొదటి 2–3 సంవత్సరాల్లో మంచి దిగుబడిని సాధించడం కష్టం. ఎందుకంటే అప్పటివరకు రసాయనాలు వాడిన నేల మళ్లీ సారవంతంగా మారడానికి కొంత టైం పడుతుంది. ‘‘ ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీల కోసం చాలామంది రైతులు సేంద్రియ వ్యవసాయం చేయడానికి ముందుకు వచ్చినప్పటికీ.. దిగుబడి రాకపోవడంతో పూర్తిగా సేంద్రియ పద్ధతులు పాటించలేకపోయారు.
అప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది. తక్కువ ఎరువులతో పండే పంటలు వేస్తే.. అసలు రసాయనాలే వాడాల్సిన అవసరం రాదు కదా! అనే ఆలోచన వచ్చింది. అప్పటినుంచి తక్కువ ఇన్పుట్తో ఎక్కువ అధిక దిగుబడినిచ్చే పంటల గురించి రీసెర్చ్ చేశా. అప్పుడు నాకు పోషక విలువలు ఎక్కువగా ఉండే, ఈజీగా సాగు చేయగలిగే మునగ పంటతో లాభాలు బాగా వస్తాయి అనిపించింది. పైగా దీనికి సూపర్ ఫుడ్ అనే పేరుంది. కాబట్టి మార్కెట్లో డిమాండ్ ఉంది. అందుకే రైతులకు ఈ పంట మీద అవగాహన కల్పించడం మొదలుపెట్టా” అంటూ చెప్పుకొచ్చింది కామిని.
స్వయంగా వ్యవసాయం
రైతులకు మునగ పంట గురించి మరింత అవగాహన కల్పించడానికి తానే స్వయంగా సాగు చేయాలని నిర్ణయించుకుంది. అలా 2017లో కామిని రైతుగా మారింది. లక్నోలో ఏడు ఎకరాల భూమిని లీజుకు తీసుకుని మునగ సాగు మొదలుపెట్టింది. అంచనాలకు మించి ఫలితాలు వచ్చాయి. తక్కువ నీళ్లు, ఎరువులతో మంచి దిగుబడి వచ్చింది. పైగా ఈ పంట మిగతా వాటితో పోలిస్తే వాతావరణ పరిస్థితులను కాస్త ఎక్కువగానే తట్టుకుంటుంది. దాంతో తన పంటను ఉదాహరణగా చూపించి రైతులను మునగ సాగు చేయాలని చెప్పింది కామిని. అయినా.. చాలామంది ముందుకురాలేదు. దాంతో.. కామిని ఒక కొత్త ఐడియాతో వెళ్లింది.
►ALSO READ | Benefits of Milk: హెల్దీగా ఉండాలంటే.. పాలు తాగితే చాలు.. పాలు తాగడం వల్ల బరువు పెరుగుతారా..?
సంప్రదాయ పంటలతో పాటే ఈ పంట సాగు చేసేందుకు పొలం గట్లపై మునగ మొక్కలు నాటాలని రైతులకు చెప్పింది. దానివల్ల వాళ్లకు కలిగే నష్టమేమీ లేదని కొంతమంది రైతులు ఈ ప్రయోగం చేశారు. వాళ్లు సంవత్సరానికి ఎకరాకు రూ. 30 వేల వరకు సంపాదించారు. ఆ తర్వాత వాళ్లను చూసి చాలామంది ముందుకొచ్చారు. మొదట్లో ఇది ఒక చిన్న సమూహంగా ప్రారంభమైనా ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ మొత్తం కలిపి 1,050 మందికి పైగా రైతులతో ఒక నెట్వర్క్గా ఏర్పడింది. వాళ్లలో ప్రతి ఒక్కరికీ ఇప్పటికీ కామిని తన సపోర్ట్ని అందిస్తోంది.
స్టార్టప్ జర్నీ..
మునగను మార్కెట్ చేయడం కామినికి కాస్త కష్టంగానే అనిపించింది. మార్కెట్లో కొన్నిసార్లు ధరలు బాగా తగ్గాయి. దాంతో ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. మునగతో కొన్ని రకాల నిల్వ ఉండే పొడులు తయారుచేసి మార్కెట్ ధరలతో సంబంధం లేకుండా తానే నేరుగా ప్రజలకు అమ్మాలి అనుకుంది. వెంటనే మునగ ఆకుల ప్రాసెసింగ్ యూనిట్ పెట్టింది. మొదట్లో ఉత్పత్తి తక్కువగానే చేసినా నెట్వర్క్లో ఎక్కువమంది రైతులు చేరడంతో దిగుబడి బాగా పెరిగింది.
దాంతో 2019లో ‘డాక్టర్ మొరింగా ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో ఒక స్టార్టప్ పెట్టి.. పెద్ద ప్రాసెసింగ్ యూనిట్ని ఏర్పాటుచేసింది. ఇందులో ప్రస్తుతం సబ్బులు, గ్రీన్ టీల నుంచి కుకీలు, క్యాప్సూల్స్, ఆయిల్స్, ఫేస్ సీరమ్ల వరకు దాదాపు 22 రకాల ప్రొడక్ట్స్ని తయారుచేస్తున్నారు. అంతేకాదు.. రైతుల కోసం ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్(ఎఫ్పీవో)ని కూడా ప్రారంభించింది. దాని ద్వారా రైతుల నుంచి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా మునగాకు, మునక్కాయలు కొంటున్నారు.
9 లక్షలను 1.75 కోట్లుగా..
కామిని మొదట్లో రూ. 9 లక్షల రూపాయలు అప్పు చేసి ప్రాసెసింగ్ యూనిట్ పెట్టింది. డాక్టర్ మొరింగా ప్రొడక్ట్స్కి డిమాండ్ పెరగడంతో ఇప్పుడు ఏటా దాదాపు రూ. 1.75 కోట్ల టర్నోవర్ వస్తోంది. ప్రస్తుతం ప్రొడక్ట్స్ని 30 శాతం ప్రాఫిట్ మార్జిన్తో అమ్ముతున్నారు. గతంలో ఎకరాలో సంప్రదాయ పంటలు సాగు చేసి సుమారు రూ. 25 వేలు సంపాదించిన రైతులు ఇప్పుడు రూ. లక్ష వరకు సంపాదిస్తున్నారు.
ఇప్పటికీ సేంద్రియ పద్ధతుల్లోనే..
కామిని ఒక వైపు కంపెనీని నడుతుపూనే రెగ్యులర్గా రైతులకు సేంద్రియ వ్యవసాయం మీద అవగాహన కల్పిస్తోంది. అందువల్ల నెట్వర్క్లోని రైతులంతా ఆర్గానిక్ పద్ధతిలోనే సాగు చేస్తున్నారు. పంటల నాణ్యత పెంచేందుకు తెగులు నియంత్రణ, ఎరువుల వాడకం లాంటివి రెగ్యులర్గా తనిఖీ చేస్తుంటుంది. కొన్నిసార్లు రైతులకు ప్రత్యేకంగా ట్రైనింగ్ సెషన్లు కూడా నిర్వహిస్తోంది. నైపుణ్యం కలిగిన సేంద్రియ రైతులుగా మార్చడానికి వాళ్లకు అవసరమైన ప్రతి ఒక్కటీ అందిస్తోంది. దానివల్ల లక్నో చుట్టుపక్కల ఉన్న దాదాపు 15 గ్రామాల్లో రైతులు మునగ సాగు చేస్తున్నారు.
పది ఎకరాల్లో..
లక్నోలోని బక్షి కా తలాబ్ ప్రాంతానికి చెందిన శాలిక్రమ్ యాదవ్ నాలుగు సంవత్సరాలుగా మునగ సాగు చేస్తున్నాడు. “నేను సిటీలోని ఒక స్టాల్లో కామిని మేడమ్ను కలిశా. అక్కడామె నా పొలం గట్ల మీద మునగ మొక్కలు నాటేలా ఒప్పించింది. పొలం చుట్టూ 400 మొక్కలు నాటా. ఒక సాధారణ రైతుకు ఎదురయ్యే ప్రధాన సవాలు మార్కెటింగ్. అందుకే పంటను మార్కెట్ చేసుకోగలనో లేదో అనే భయం ఉండేది. అప్పుడు నాకు మేడం భరోసా ఇచ్చింది. మార్కెట్ చేసుకోలేకపోతే తానే కొంటానంది. చెప్పినట్టే కొని నా భయాలన్నింటినీ పోగొట్టింది. అదృష్టవశాత్తూ బాగా లాభాలు వచ్చాయి. దాంతో ఇప్పుడు నాకున్న పదెకరాల్లో మొత్తం మునగ మొక్కలు నాటాను. ప్రస్తుతం కిలో మునగ ఆకులను రూ. 60కి అమ్ముతున్నా. ఈ సీజన్లో ఎకరాకు ఐదు క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. వాతావరణ మార్పుల వల్ల మునగ కాయల దిగుబడి తక్కువగా ఉన్నా నాకు నష్టం రాలేదు” అన్నాడు యాదవ్.
17 ఎకరాల్లో సాగు
లక్నోలోని మలిహాబాద్ బెల్ట్లో రైతు అనిల్ కుమార్ సింగ్ 17 ఎకరాల్లో మునగ సాగు చేస్తున్నాడు. “నాలుగు సంవత్సరాల క్రితం నేను ఒక ఎకరంలో సాగు చేశా. కానీ.. ఈ పంటలో బాగా లాభాలు వస్తుండడం, సైంటిస్ట్ కామిని నాకు దీనిపై అవగాహన కల్సించడం వల్ల మిగతా పొలంలో కూడా మునగ మొక్కలు నాటా. గతంలో అదే పొలంలో గోధుమ, వరి సాగు చేసినప్పుడు సుమారు రూ. 40 వేలు లాభం వచ్చేది. కానీ.. ఇప్పుడు రూ. 1.5 లక్షల వరకు సంపాదిస్తున్నా. ఆకులు, కాయలు రెండింటినీ అమ్మడం వల్లే ఇంతలా లాభాలు వస్తున్నాయి. అంతెందుకు మొదటి సంవత్సరంలోనే నా పెట్టుబడి పోను రూ. 30 వేలు మిగిలాయి. నా సక్సెస్ని చూసి ఇప్పుడు చాలామంది మునగ సాగు మొదలుపెట్టాడు” అంటున్నాడు అనిల్.