తిరువీర్ హీరోగా నటిస్తున్న పీరియడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘భగవంతుడు’. ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటిస్తోంది. కన్నడ నటుడు రిషి కీలకపాత్ర పోషిస్తున్నారు. జి.జి. విహారి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఏషియన్ ఫిలిమ్స్ నారాయణదాస్ నారంగ్, పనస శంకరయ్య గౌడ్ సమర్పణలో రవి పనస నిర్మిస్తున్నారు. సోమవారం ఈ చిత్రం నుంచి సెకండ్ సింగిల్గా ‘సిత్తరాల నవ్వు’ అనే పాటను విడుదల చేశారు. కృష్ణ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాటను జావెద్ అలీ పాడాడు.
‘‘సిత్తరాల నవ్వు, అరే సిలకల్లే నువ్వు, సేమంతి పువ్వు, నీలాల కళ్లు, అరే పారే సెలయేళ్లు, ఒంపు పరవళ్లు.. నేలమ్మ సిగలోన సిరిమల్లెవా.. మరి నీ చూపే తొలి వేకువా.. నిను తాకే మొలకేసే సేను, సెలక.. ఓ సిలక మనసే మెలిక..’ అంటూ దర్శకుడు జి.జి. విహారి రాసిన లిరిక్స్ ఆకట్టుకున్నాయి.
గ్రామీణ నేపథ్యంలో తిరువీర్, ఫరియా అబ్దుల్లా జంటపై చిత్రీకరించిన తీరు ఆకట్టుకుంది. రవీందర్ విజయ్, షెల్లీ కిషోర్, కాలకేయ ప్రభాకర్, చిరాగ్ జానీ ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
