గోపాలపురం ఇన్‌స్పెక్టర్‌, ఎస్ఐ సస్పెండ్

గోపాలపురం ఇన్‌స్పెక్టర్‌, ఎస్ఐ సస్పెండ్

సికింద్రాబాద్ నార్త్ జోన్ గోపాలపురం ఇన్‌స్పెక్టర్‌ మురళీధర్ తో పాటు ఎస్ఐ దీక్షిత్ రెడ్డి లను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు. డిమార్ట్ సెల్లార్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి అంజి రెడ్డి హత్య కేసులో అలసత్వం వహించి, సరైన విచారణ జరపనందుకు వీరిపై సస్పెండ్ వేటు పడింది.

రెండు నెలల క్రితం గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన అంజి రెడ్డి హత్య కేసులో మురళీధర్, దీక్షిత్ లు అలసత్వం వహించిన కారణంగా సస్పెండ్ చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అంజిరెడ్డిని రాజేష్‌ అనే వ్యక్తి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. 

అంజిరెడ్డి ఆస్తులను కాజేసేందుకే నిందితుడు పక్కా ప్రణాళిక ప్రకారం కుట్ర చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇద్దరు బిహారీ వ్యక్తులతో కలిసి అంజిరెడ్డిని రాజేష్‌ హత్య చేసినట్లు పోలీసులకు విచారణలో తేలింది.  అనంతరం దీనిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించినట్లు పోలీసులు తెలిపారు.