
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సమగ్ర విత్తన చట్టాన్ని రూపొందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముసాయిదా కమిటీ తాజాగా సమావేశమైంది. గురువారం హైదరాబాద్లోని అగ్రికల్చర్ కమిషనరేట్లో కమిటీ భేటీ అయింది. విత్తన చట్టం ముసాయిదా కమిటీ కన్వీనర్, అగ్రికల్చర్ డైరెక్టర్ బి.గోపి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కమిటీ సభ్యుడు, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, భూమి సునీల్, దొంతి నర్సింహారెడ్డి తదితర కమిటీ సభ్యులు విత్తన చట్టం డ్రాఫ్ట్పై సుదీర్ఘంగా చర్చించారు.
విత్తన కమిటీ సభ్యులు ఇప్పటికే వరంగల్, హనుమకొండ, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, గద్వాల్, నిజామాబాద్ జిల్లాల్లో పర్యటించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విత్తన కంపెనీల ప్రతినిధులు, డీలర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో సమావేశమై సలహాలు, సూచనలు తీసుకున్నారు. కమిటీ సభ్యులు హర్యానాలో పర్యటించి విత్తన చట్టం అమలవుతున్న తీరుపై, రైతుల అభిప్రాయాలు, అక్కడి చట్టంలోని అంశాలపై అధ్యయనం చేసిన విషయాలను చర్చించారు.
రాష్ట్రంలో సమగ్ర విత్తన చట్టం తీసుకొచ్చే క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏయే అంశాలు ఉండాలి.. డ్రాఫ్ట్ ఎలా ప్రిపేర్ చేయాలి.. అనే అంశాలపై కమిటీ సభ్యులు ఈ సమావేశంలో డిస్కస్ చేశారు. ఈ నెల 30న మరోసారి సమావేశమై డ్రాఫ్ట్ ప్రిపరేషన్పై నిర్ణయం తీసుకోనున్నారు. అవసరమైతే విత్తన రంగంలో అనుభవం ఉన్న వారి అభిప్రాయాలు, సలహాలు సూచనలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ సుచరిత తదితరులు పాల్గొన్నారు.