హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగు నీరందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటునందించాలని పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్క కోరారు. శుక్రవారం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్.పాటిల్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ప్రజాభవన్ నుంచి ఆమె పాల్గొన్నారు.
జల్ జీవన్ మిషన్ అమలు, నిధుల కేటాయింపుపై కీలక ప్రతిపాదనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి, ఇంటింటికీ నల్లా నీరు అందిస్తోందని తెలిపారు. సంబంధిత ప్రాజెక్టుల నిర్వహణకు ఏటా వందల కోట్లు వెచ్చించాల్సి వస్తోందన్నారు. కేంద్రం ప్రాజెక్టుల నిర్మాణంలోనే కాకుండా, వాటి నిర్వహణ వ్యయంలోనూ భాగస్వామ్యం కావాలని కోరారు. మంత్రి సీతక్క ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.
