
- మహిళలకు ప్రాధాన్యత పెంచాలని రాష్ట్ర సర్కార్ యోచన
- వివిధ రకాల ఉపాధి కల్పించి.. ఆర్థికంగా బలోపేతం చేసేలా ప్రణాళికలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆరు గ్యారంటీల అమలులో స్వయం సహాయక సంఘాలకు భాగస్వామ్యం కల్పించాలని భావిస్తున్నది. సంఘాల మహిళలందరికీ వివిధ రకాలుగా ఉపాధి కల్పించి.. ఆర్థికంగా బలోపేతం చేసేలా కార్యక్రమాలు చేపట్టాలని చూస్తోంది. అందులో భాగంగా మహిళా సంఘాలకు పునరుజ్జీవం పోయాలనుకుంటోంది. గ్యారంటీల అమలులో స్వయం సహాయక సంఘాల భాగస్వామ్యం ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.
మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్ జర్నీ అమలు చేస్తోంది. దీంతో పాటు రూ.500లకు గ్యాస్ సిలిండర్, ఇతర గ్యారంటీలకూ ఎంత వరకు వారికి అవకాశం కల్పించాలనే దానిపై కసరత్తు మొదలైంది. త్వరలో అమలు చేయనున్న రెండు గ్యారంటీలకు అన్ని గ్రామాల్లో సంఘాలను భాగస్వామ్యం చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటు వడ్డీలేని రుణాలకు కేంద్ర పథకాలతో లింక్ పెట్టాలని చూస్తోంది. ఇప్పటికే స్త్రీ శక్తికి బీఆర్కే భవన్లో ఆఫీసు స్పేస్ కు నిర్ణయం తీసుకున్నది.
నెల నెలా ఉపాధి ఉండేలా కొత్త మార్గాల అన్వేషణ, విద్యార్థులు, పోలీసులకు ఇచ్చే యూనిఫాంలు కుట్టించే పని అప్పగించనున్నది. మండలాలు, జిల్లా కేంద్రాల్లో మహిళలకు టైలరింగ్లో శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నది. గత ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల డబ్బులు కూడా నిలిపివేయడంతో, ఈసారి అలా జరగకుండా చూడాలని ఇప్పటికే ప్రభుత్వం నుంచి అధికారులకు ఆదేశాలు వెళ్లాయి.
రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షలకు పైగా స్వయం సహాయక సంఘాలు
రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల 37 వేల 899 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వాటిలో 46.68 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాలకు చెందిన మహిళలే ఎక్కువగా ఉన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలను వివిధ రకాలుగా అప్పటి ప్రభుత్వం వినియోగించుకున్నది. ఇప్పుడు కూడా అదే మాదిరిగా మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేలా ప్రభుత్వం నుంచి ఏం చేయాలనే దానిపై ప్రతిపాదనలు రెడీ అవుతున్నాయి. ఎస్హెచ్జీ గ్రూప్లను ఆరు గ్యారంటీల్లో భాగస్వామ్యం చేయడం ద్వారా డూబ్లికేషన్ లేకుండా.. అర్హులైన వారికే లబ్ధి జరిగే అవకాశం ఉంటుందని సర్కారు భావిస్తున్నది.