తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ ఏపీకి రిలీవ్ కావడంతో కొత్త సీఎస్ ఎవరనేదానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే సీఎస్ రేసులో 10 మంది ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ముఖ్యంగా రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు అరవింద్ కుమార్, రామకృష్ణరావు, రజత్ కుమార్, శాంతికుమారి, రాణి కుమిదిని, శశాంక్ గోయల్, వసుధా మిశ్రా, అశోక్ కుమార్, సునీల్ శర్మ రేసులో ఉన్నారు. వీరిలో ఎవరో ఒక్కరు కొత్త సీఎస్ అవుతారనే ప్రచారం జరుగుతోంది.
వీరిలో రామకృష్ణారావు ఏపీకి చెందినవారు. ఆయనకే ఎక్కువ శాతం అవకాశం ఉందని సమాచారం. ఆయన ప్రస్తుతం ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్గా పని చేస్తున్నారు. సునీల్ శర్మ, శాంతకుమారి, వసుధా మిశ్రా, రాణి కుముదిని కూడా స్పెషల్ సీఎస్లుగా ఉన్నారు. అయితే వసుధా మిశ్రా సెంట్రల్ సర్వీస్లో ఉండగా వచ్చే నెలలో రిటైర్ అవుతున్నారు. రాణి కుముదిని జులైలో, రజత్ కుమార్ నవంబర్లో రిటైర్ కానుండగా అరవింద్కుమార్ సెంట్రల్ సర్వీస్లోకి వెళ్లడానికి అప్లై చేసుకున్నారు.
సీఎస్ సోమేశ్ ను ఏపీ కేడర్ కు వెళ్లిపోవాల్సిందేనని.. రేపటి లోగా ఏపీలో రిపోర్టు చేయాలని కేంద్రం ఆదేశించింది. అయితే, హైకోర్టు ఆదేశాలపై సోమేశ్ కుమార్ ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ లో సోమేశ్ కుమార్ పదవీకాలం పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే అవకాశాలే ఎక్కువని తెలుస్తోంది.

