Team India: ఇంగ్లాండ్ (UK) పర్యటన నిరాశజనకంగా ముగిసిన తర్వాత, భారత వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్ (Shubman Gill) జట్టులోని ఆటగాళ్లు పదే పదే గాయాల బారిన పడటంపై బహిరంగంగానే తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా హ్యామ్స్ట్రింగ్ గాయాలు జట్టు యాజమాన్యానికి పెద్ద తలనొప్పిగా మారాయి. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE), ఆటగాళ్లు, టీమ్ సపోర్ట్ స్టాఫ్ మధ్య సరైన సమన్వయం (Communication Gap) లేకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని తెలుస్తుంది.
CoE లో గందరగోళం:
నితిన్ పటేల్ CoE నుంచి నిష్క్రమించినప్పటి నుంచి మెడికల్ స్టాఫ్ హెడ్ను ఇప్పటి వరకు బీసీసీఐ నియమించకపోవడం గమనార్హం. 2023లో రూపొందించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOPs)లో ఇప్పటి వరకు ఎలాంటి మార్పులు చేయలేదు. ఇక మైదానంలోకి దిగే ముందు ఆటగాళ్లు ఎంతవరకు ఫిట్గా ఉన్నారనే దానిపై CoE మెడికల్ టీమ్, టీమ్ మేనేజ్మెంట్ మధ్య స్పష్టమైన సమాచారం ఉండటం లేదని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
నితీష్, హర్షిత్, వాషింగ్టన్లతోనే అసలు సమస్య:
వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా వంటి యువ ఆటగాళ్లు చాలా తక్కువ సమయంలోనే పదే పదే గాయపడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
* నితీష్ రెడ్డి స్పీడ్ పెంచే ప్రయత్నం: నితీష్ కుమార్ రెడ్డి తన బౌలింగ్ వేగాన్ని పెంచుకోవడానికి ఇంగ్లీష్ కోచ్ స్టెఫాన్ జోన్స్తో కలిసి పని చేశాడు. అయితే పెద్ద టోర్నీలకు ముందు ఇలాంటి మార్పులు నెమ్మదిగా జరగాలి.. కానీ నితీష్ టీమ్తో ఉన్నప్పుడే వేగంగా బౌలింగ్ చేయడానికి తనపై తాను ఎక్కువగా ఒత్తిడి తెచ్చుకుంటున్నాడని తెలుస్తుంది.
* అరకొర ఫిట్నెస్తో హర్షిత్ రాణా: హర్షిత్ రాణా మోకాలి గాయం నుంచి కోలుకున్నప్పటికీ, పాత ఫిట్నెస్, బరువు సాధించకముందే టీమ్ మేనేజ్మెంట్ ఒత్తిడి మేరకు CoE అతడికి క్లియరెన్స్ ఇచ్చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి.
* వాషింగ్టన్ సుందర్ను రప్పించిన తొందరపాటు: ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన టీ20 ప్రపంచకప్ కోసం వాషింగ్టన్ సుందర్ను ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించకముందే జట్టులోకి త్వరితగతిన రప్పించారు. జట్టుతో చేరిన తర్వాత మ్యాచ్ ఆడటానికి అతనికి కనీసం 10 రోజుల సమయం పడుతుందని తెలిసినా మేనేజ్మెంట్ తొందరపడిందని, అది అతడి ఆరోగ్యంపై ప్రభావం చూపించిందని తెలుస్తోంది.
కమ్యూనికేషన్ గ్యాప్తో టెన్షన్లో ప్లేయర్స్:
ప్రస్తుత క్రికెట్లో అన్ని ఫార్మాట్లు ఆడే ఆటగాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారు. చాలా మందికి అంతర్జాతీయ మ్యాచ్ల మధ్య తగినంత విరామం దొరుకుతుంది. ఇక CoE లో పునరావాసం (Rehabilitation) పొందని సమయంలో బీసీసీఐ మెడికల్ టీమ్ నుంచి తగినంత కమ్యూనికేషన్ ఉండటం లేదని, తమకు ఏమైనా సమస్య వస్తే ఎవరిని సంప్రదించాలో తెలియక ప్లేయర్స్ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని సమాచారం. కాగా టీమ్ మేనేజ్మెంట్ ఆటగాళ్లను కోరినప్పటికీ, మెడికల్ టీమ్ వారి అసలు ఫిట్నెస్ పరిస్థితిని దాచకుండా స్పష్టమైన నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఉందని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి.
