- సెన్సెక్స్ 1,470 పాయింట్లు డౌన్
- ఇన్వెస్టర్లకు రూ.10 లక్షల కోట్ల లాస్
- 101 డాలర్లకు క్రూడాయిల్
- రూ.10,716 కోట్ల షేర్లు అమ్మిన విదేశీ ఇన్వెస్టర్లు
- జీవిత కాల కనిష్టానికి రూపాయి
ముంబై: మార్కెట్ పతనం వరుసగా మూడో రోజూ కొనసాగింది. బెంచ్మార్క్ ఇండెక్స్లు సెన్సెక్స్, నిఫ్టీ శుక్రవారం 2 శాతానికి పైగా నస్టపోయాయి. ఇన్వెస్టర్లు సంపద దాదాపు రూ.10 లక్షల కోట్లు ఆవిరైంది. బీఎస్ఈలో లిస్ట్ అయిన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ రూ.430 లక్షల కోట్లకు తగ్గింది. ఈ నెలలో ఇప్పటివరకు నిఫ్టీ 8 శాతం నష్టపోగా, ఇన్వెస్టర్లు రూ.34 లక్షల కోట్లు లాస్ అయ్యారు. నిఫ్టీ శుక్రవారం 489 పాయింట్లు (2.06 శాతం) తగ్గి 23,151 వద్ద, సెన్సెక్స్ 1,470 పాయింట్లు నష్టపోయి 74,564 దగ్గర ముగిశాయి.
కిందటేడాది ఏప్రిల్ తర్వాత మొదటిసారిగా సెన్సెక్స్ 75 వేల కిందకు, నిఫ్టీ 23,200 కిందకు జారాయి. ఎల్ అండ్ టీ, టాటా స్టీల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), భారత్ ఎలక్ట్రానిక్స్, మారుతి సుజుకీ షేర్లు శుక్రవారం 3–7 శాతం క్రాష్ అయ్యాయి. హిందుస్తాన్ యూనిలీవర్, భారతీ ఎయిర్టెల్ మాత్రమే లాభాల్లో ముగిశాయి. అన్ని సెక్టార్ల ఇండెక్స్లో రెడ్లో క్లోజ్ అవ్వగా, నిఫ్టీ మెటల్ ఏకంగా 5 శాతం పడింది. నిఫ్టీ ఆటో 4 శాతం నష్టపోయింది. ఎన్ఎస్ఈలో 580 షేర్లు లాభాల్లో, 2,645 షేర్లు నష్టాల్లో ముగిశాయి. 93 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.
మార్కెట్ పడడానికి కారణాలు..
ఇరాన్– అమెరికా యుద్ధం..
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దేశాల లీడర్లు యుద్ధాన్ని ఆపబోమని ప్రకటనలు చేయడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీస్తోంది. యుద్ధం కిందటి నెల 28 న మొదలవ్వగా శుక్రవారం నాటికి రెండు వారాలు పూర్తయ్యింది. ఇరాన్ పొరుగు దేశాల ఆయిల్ స్టోరేజ్ ఫెసిలిటీలపై, హార్మూజ్ జలసంధిలో ఆయిల్ ట్యాంకర్లపై దాడులు చేస్తుండడంతో క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి.
వంద డాలర్లు దాటిన ఆయిల్
బెంచ్మార్క్ బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 100 డాలర్లు దాటింది. 101 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది. యుద్ధం ఇప్పటిలో ఆగేటట్టు కనిపించకపోవడంతో ఆయిల్ ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. హార్మూజ్ జల సంధి మరో 4–8 వారాలు మూతపడితే క్రూడ్ ధరలు 150 డాలర్లకు చేరుకుంటాయని ఎనలిస్టులు చెబుతున్నారు. ధరలు 200 డాలర్ల వరకు కూడా వెళతాయని ఇరాన్ హెచ్చరించడంతో మార్కెట్లు పడుతున్నాయి. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) 400 మిలియన్ బ్యారెల్స్ను స్ట్రాటజిక్ రిజర్వ్ల నుంచి బయటకు తీస్తామని హామీ ఇచ్చినా, రష్యన్ ఆయిల్ను కొనుగోలు చేయడానికి అన్ని దేశాలకు అమెరికా అనుమతి ఇచ్చినా, క్రూడ్ ధరలు దిగి రావడం లేదు.
గ్లోబల్ మార్కెట్స్ డౌన్
గ్లోబల్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో కదిలాయి. జపాన్ నిక్కీ 225, సౌత్ కొరియా కొస్పీ ఒక శాతానికిపైగా, హాంకాంగ్ హంగ్ సెంగ్, చైనా షాంఘై కాంపోజిట్ ఒక శాతం చొప్పున పడ్డాయి. అమెరికా మార్కెట్లు గురువారం ఒకటిన్నర శాతం నష్టపోగా, శుక్రవారం మిశ్రమంగా కదిలాయి. యూరప్ మార్కెట్లు కూడా స్పల్ప నష్టాల్లో ట్రేడయ్యాయి.
రూపాయి@ 92.30
ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) ఇండియా మార్కెట్ నుంచి వెళ్లిపోతుండడం, క్రూడ్ ధరలు పెరగడంతో రూపాయి విలువ క్షీణిస్తోంది. డాలర్తో 5 పైసలు తగ్గి 92.30 వద్ద జీవిత కాల కనిష్టాన్ని నమోదు చేసింది. ఇరాన్, అమెరికా యుద్ధం మొదలైనప్పటి నుంచి 2 శాతం క్షీణించింది. ఎఫ్ఐఐలు గురువారం రూ.7,050 కోట్ల షేర్లను అమ్మగా, శుక్రవారం మరో రూ.10,716 కోట్ల విలువైన షేర్లను అమ్మారు.యూఎస్ బాండ్ ఈల్డ్లు 4.255 శాతానికి చేరడంతో ఇండియా నుంచి విదేశీ పెట్టుబడులు వెళ్లిపోతున్నాయి.
