కేసీఆర్పై బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ సంజయ్ ఫైర్
విమోచన దినోత్సవం అధికారికంగా జరపాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరిపించాలని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సెప్టెంబర్ 17ను కేసీఆర్ మరిచిపోయారని విమర్శించారు. హైదరాబాద్లోని పార్టీ స్టేట్ ఆఫీస్లో సంజయ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్లో ఎమ్మెల్సీ రాంచందర్రావు, ఎమ్మెల్యే రాజాసింగ్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్, రాష్ట్ర సంఘటన కార్యదర్శి శ్రీవర్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. 1948 సెప్టెంబర్ 17న సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ చేపట్టిన పోలీసు చర్యతోనే తెలంగాణ ప్రాంతానికి నిజమైన స్వాతంత్రం లభించిందన్నారు. తెలంగాణ ప్రజలను అరిగోస పెట్టిన నిజాంను గద్దె దింపి, హైదరాబాద్ సంస్థానానికి విమోచనం కల్పించిన సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవం జరిపించాల్సిందేనన్నారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరిపిస్తామన్న కేసీఆర్, సీఎం అయ్యాక ఆ హామీని విస్మరించారని మండిపడ్డారు. మజ్లీస్పై ప్రేమతో నయా ఖాసీం రజ్వీలా కేసీఆర్ వ్యవహరిస్తూ, నిజాం వారసత్వానికి కొమ్ము కాస్తున్నారని దుయ్యబట్టారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పలు కార్యక్రమాలను నిర్వహించనుందని సంజయ్ ప్రకటించారు. కాగా, సంజయ్ సమక్షంలో పలు పార్టీల నేతలు శనివారం బీజేపీలో చేరారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు ఎంపీపీ సంధ్యారాణి సందీప్ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన మాదాసు వెంకటేశ్ బీజేపీలో చేరారు. సమావేశంలో రవీందర్, గుజ్జ సత్యనారాయణ, ఎ.రవీందర్, సత్యనారాయణ పాల్గొన్నారు.
ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్లను ఆదుకోవాలి
రాష్ట్రంలో ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్ల పరిస్థితి దారుణంగా ఉందని, ప్రభుత్వమే వారిని ఆదుకోవాలని సంజయ్ డిమాండ్ చేశారు. కరోనా కాలంలో స్కూళ్లు మూతబడడంతో యాజమాన్యాలు శాలరీలు ఇవ్వడం లేదని, వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. టీచర్స్డే సందర్భంగా శనివారం ఆయన ప్రకటన రిలీజ్ చేశారు. ఆరు నెలలుగా టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్లు జీతాల్లేక ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వానికి సాయం చేసేందుకు మనసు రావడం లేదన్నారు. వెంటనే వాళ్ల కోసం స్పెషల్ ప్యాకేజీ ప్రకటించాలన్నారు. గవర్నమెంట్ టీచర్లు కూడా ఇబ్బంది పడుతున్నారన్నారు. 7వ పీఆర్సీ అమలును వాయిదా వేస్తోందని, ఐఆర్ ను ప్రకటించడం లేదని మండిపడ్డారు. కరోనా సాకుతో జీతాలు, పెన్షన్లలో కోత పెట్టిందన్నారు. టీచర్ల న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు బీజేపీ వాళ్ల తరఫున పోరాడుతుందన్నారు. టీచర్స్ డే సందర్భంగా గురువులు అందరికీ శుభాకాంక్షలు చెప్పారు.
పార్టీ కార్యక్రమాలు ఇవీ..
సెప్టెంబర్ 7న ఎమ్మార్వోలకు, కలెక్టర్లకు వినతి పత్రాలు
8న రజాకార్ల దాడులకు గురైన చరిత్రాత్మక స్థలాల సందర్శన
9న కొలన్ పాక, బైరన్ పల్లి, అమరధామం, జోడిగడ్ ప్రాంతాల సందర్శన
10న ప్రెస్ క్లబ్లో మేధావుల సదస్సు
11న నిరసనలు, 12న మండల, జిల్లా స్థాయిలో మీడియా సమావేశాలు
15న కళాకారులకు సన్మానం
6న విమోచన దినోత్సవ ప్రాముఖ్యతపై చైతన్యం కల్పించే కార్యక్రమాలు
17న ప్రతి పోలింగ్ బూత్లో జాతీయ జెండా ఎగురవేయడం, అదే రోజు సాయంత్రం 4 గంటలకు ఆన్లైన్ బహిరంగ సభ (వర్చువల్ ర్యాలీ).