
నందుర్బార్: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భక్తులను తీసుకెళ్తున్న పికప్ ట్రక్ లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. నందుర్బార్ జిల్లా ధడ్గావ్-తలోడా ప్రాంతంలోని మకడ్ టెక్డి సమీపంలో చంద్షైలి ఘాట్ వద్ద శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
యాత్రికులు అస్తంబ దేవి యాత్ర నుంచి తిరిగి వస్తుండగా.. ఘాట్లోని ఒక మలుపులో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఓవర్ స్పీడ్, షార్ప్ టర్న్ వద్ద నియంత్రణ కోల్పోవడమే ప్రమాదానికి కారణమని అధికారులు భావిస్తున్నారు. మొత్తం 28 మంది గాయపడగా.. 15 మంది పరిస్థితి క్రిటికల్గా ఉంది.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. గాయపడినవారిని తలోడా హాస్పిటల్కు తరలించారు. మృతుల గుర్తింపు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించే ప్రక్రియ జరుగుతోందని పోలీసులు తెలిపారు.