సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. SI, కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. SI, కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం (జూన్ 26) ఉదయం కోదాడ బైపాస్ దుర్గాపురం స్టేజ్ దగ్గర ఓ లారీ కారును వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్సై, ఓ కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. 

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కోదాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతులను ఏపీలోని కోనసీమ జిల్లా ఆలమూరు ఎస్సై అశోక్, కానిస్టేబుల్ స్వామిగా గుర్తించారు. హోంగార్డ్, ప్రైవేట్ డ్రైవర్ గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో  చికిత్స పొందుతున్నారు. ఓ కేసు విచారణలో భాగంగా ఏపీ పోలీసుల బృందం హైదరాబాద్ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. 

ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కోదాడ పోలీసులు.. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు ఆరా తీశారు. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జు అయ్యింది. మృతదేహాలు కారులో ఇరుక్కుపోగా.. పోలీసులు కారు పై భాగాన్ని తొలగించి డెడ్ బాడీలను బయటకు తొలగించారు. మృతుల కుటుంబ సభ్యులకు, ఆంధ్రప్రదేశ్ సంబంధిత అధికారులకు కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి సమాచారం అందించారు.