
- భారీగా అప్లికేషన్లు.. ఒక్కో గ్రామంలో 100 నుంచి 150 మంది బాధితులు
- కొన్ని గ్రామాల్లో 300కు పైనే అప్లికేషన్లు.. కేటగిరీలవారీగా డివైడ్ చేయాలని నిర్ణయం
- సమస్యల పరిష్కారానికి పంద్రాగస్టును డెడ్లైన్గా పెట్టుకున్న సర్కార్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా10 వేలకుపైగా గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో 7 లక్షలకుపైగా భూ సమస్యలు వెలుగులోకి వచ్చాయి. ఒక్కో గ్రామంలో సరాసరి 100 నుంచి 150 మంది బాధితులు ఉండగా, కొన్ని గ్రామాల్లో ఈ సంఖ్య 300కుపైనే ఉన్నట్టు వెల్లడైంది. అధికారుల పనితీరు మెరుగ్గా ఉన్న చోట సమస్యలు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
ధరణి పోర్టల్లో పరిష్కారం కాని ఈ సమస్యలను ఇప్పుడు భూభారతి చట్టం కింద పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం రెవెన్యూ సదస్సులు నిర్వహించి, దరఖాస్తులు స్వీకరించింది. ఈ సందర్భంగా వచ్చిన దరఖాస్తులను కేటగిరీల వారీగా విభజించి, ఆగస్టు 15వ తేదీలోగా అన్ని సమస్యలను పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నెల 3 నుంచి హైదరాబాద్ జిల్లా మినహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు జరిగాయి.
85 శాతం మండలాల్లో అధిక సమస్యలు
గతంలో ధరణి పోర్టల్లో పరిష్కారం కాని భూ సమస్యలను ఇప్పుడు భూభారతి చట్టం అమలులో భాగంగా పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ చట్టం కింద సమస్యలను గుర్తించి, పరిష్కరించడం కోసమే రెవెన్యూ సదస్సులు నిర్వహించింది. మొత్తం 561 మండలాల్లోని 10,954 గ్రామాల్లో ఈ సదస్సులు నిర్వహించగా, భూ సమస్యలకు సంబంధించి దాదాపు 7 లక్షలకుపైగా దరఖాస్తులు అందినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ సంఖ్య రాష్ట్రంలో ఉన్న భూ సమస్యల తీవ్రతను స్పష్టం చేస్తోంది. రెవెన్యూ సదస్సులను మొదటి దశలో ఏప్రిల్లో నాలుగు జిల్లాల్లోని నాలుగు మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఈ మండలాల్లో సదస్సులు విజయవంతం కావడంతో, మే 5 నుంచి 28 జిల్లాల్లోని 28 మండలాలకు విస్తరించారు. మొదటి నాలుగు పైలట్ మండలాల్లోని 72 రెవెన్యూ గ్రామాల్లో 13 వేలకు పైగా దరఖాస్తులు రాగా, రెండో విడతలో 28 మండలాల్లోని 421 రెవెన్యూ గ్రామాల్లో 42 వేల దరఖాస్తులు అందాయి. ఈ దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు.
కొన్ని మండలాల్లో తహసీల్దార్లు ఎప్పటికప్పుడు సమస్యలను గుర్తించి.. ఫీల్డ్ లెవెల్ రిపోర్ట్లతో పరిష్కరించడంతో కొన్ని గ్రామాల్లో అప్లికేషన్లు పెద్దగా రాలేదని తెలిసింది. అయితే ఈ సంఖ్య చాలా తక్కువగా ఉన్నది. కేవలం 15 శాతం మండలాల్లోనే ఈ పరిస్థితి ఉండగా.. మిగిలిన 85 శాతం మండలాల్లో పెద్ద ఎత్తున భూ సమస్యలపై అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ధరణి పోర్టల్లో రికార్డుల తప్పిదాలు, భూ హక్కుల బదిలీలో అవకతవకలు, పంచాయతీ స్థాయిలో రికార్డుల అప్డేట్ వంటి లోపాల వల్ల సమస్యలు ఉత్పన్నమయ్యాయి.
కేటగిరీల వారీగా విభజన
రెవెన్యూ సదస్సుల్లో వెలుగు చూసిన భూ సమస్యలను కేటగిరీలవారీగా విభజించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూ సమస్యల్లో ప్రధానంగా ధరణి పోర్టల్ లోపాలు (తప్పుడు నమోదు, విస్తీర్ణం, పేర్లు, సర్వే నంబర్ల తేడాలు), పాత పహాణీలు, రికార్డుల తప్పులు (ప్రస్తుత రికార్డులకు పొంతన లేకపోవడం), వారసత్వ సమస్యలు (బదిలీలు జరగకపోవడం, పంపకాల వివాదాలు), భూమి కొలతలు, హద్దుల వివాదాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అసైన్డ్ భూముల సమస్యలు, కోర్టు కేసుల వివాదాలు, లావాదేవీల సమస్యలు (రిజిస్ట్రేషన్ కాకపోవడం), క్లరికల్ లోపాలు, సాదాబైనామా వంటివి ఉన్నాయి.
ఈ సమస్యలన్నింటినీ భూభారతి చట్టం కింద సత్వరమే పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2020లో ధరణి చట్టం అమలు తర్వాత భూ రికార్డుల్లో అనేక తప్పిదాలు, హక్కుల బదిలీలో అవకతవకలు జరిగాయి. ఇప్పుడు రెవెన్యూ సదస్సుల ద్వారా గుర్తించిన సమస్యలను భూభారతి ద్వారా పరిష్కరించాలని రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను సమర్థవంతంగా పరిష్కరించేందుకు వీటిని త్వరగా పరిష్కారమయ్యేవి, విచారణ అవసరమైనవి, సీసీఎల్ఏ అనుమతి అవసరమైనవి, కోర్టు పరిధిలోనివి అని ఇలా నాలుగైదు కేటగిరీలుగా విభజించి సమస్యలను పరిష్కరించనున్నారు. ఈ విధానం సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేస్తుందని సర్కారు భావిస్తున్నది.