
ఇంగ్లండ్ జట్టులోని ఏడుగురు సభ్యులు కరోనా బారిన పడినట్లు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ECB) ప్రకటించింది. పాకిస్తాన్ తో జరగబోయే రాయల్ లండన్ వన్డే సిరీస్, వైటాలిటీ టీ20 సిరీస్ కు ఎంపిక చేసిన టీంలోని సభ్యులకు వైరస్ సోకినట్లు తెలిపింది. కరోనా సోకిన వారిలో ముగ్గురు ఆటగాళ్లు కాగా.. నలుగురు సపోర్టింగ్ స్టాఫ్ అని తెలిపింది.
ఇంగ్లండ్ ఆరోగ్య శాఖ, వేల్స్ ఆరోగ్యశాఖ, బ్రిస్టల్ లోని స్థానిక వైద్య ఆరోగ్య శాఖ అధికారుల పర్యవేక్షణలో జులై 4 నుంచే జట్టు సభ్యులు క్వారంటైన్ లో ఉంటున్నారని.. ప్రొటోకాల్ క్వారంటైన్ ప్రకారం వారంతా సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉంటారని స్పష్టం చేసింది. వారికి క్లోజ్ కాంటాక్ట్స్ అయిన మిగతా జట్టు సభ్యులకూ ఐసోలేషన్ తప్పనిసరి అని తెలిపింది.
దీంతో పాక్ తో తలపడబోయే కొత్త జట్టును ప్రకటిస్తామని తెలిపింది. బెన్ స్టోక్స్ కెప్టెన్ గా వ్యవహరించనున్నట్లు తెలిపింది. అంతకుముందు ఆటగాళ్లందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తామంది ECB.