
- మహిళా కానిస్టేబుల్, మరో మహిళకు గాయాలు
- వరంగల్ జిల్లా నల్లబెల్లి పోలీసుస్టేషన్ లో ఘటన
నల్లబెల్లి, వెలుగు: పోలీసు స్టేషన్ లో ప్రేమ జంటపై బంధువులు దాడికి పాల్పడ్డారు. మహిళా కానిస్టేబుల్ తో పాటు మరో మహిళకు గాయాలైన ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శాయంపేట మండలం ఆరేపల్లికి చెందిన యువతి మనిషా, పత్తిపాక చెందిన యువకుడు మణిరాజ్ కొన్నాళ్లుగా ప్రేమించుకుంటూ వారం రోజుల కింద లవ్ మ్యారేజ్ చేసుకున్నారు.
ప్రేమజంట తమకు రక్షణ కల్పించాలని శాయంపేట పోలీసులను ఆశ్రయించగా.. ఇరు కుటుంబాలను పిలిపించి కౌన్సిలింగ్ఇచ్చి పంపించారు. కాగా.. నల్లబెల్లి మండలం శనిగరం గ్రామానికి చెందిన యువకుడి బంధువు సముద్రాల బాలరాజు ప్రేమ జంటను తన ఇంటికి తీసుకెళ్లాడు. ఇది తెలియడంతో యువతి బంధువులు మంగళవారం సాయంత్రం రెండు వాహనాల్లో 50 మంది వెళ్లి దాడికి పాల్పడుతుండగా గ్రామస్తులు అడ్డుకోవడంతో పారిపోయారు.
ఘటనపై బాలరాజు, ప్రేమజంట బుధవారం నల్లబెల్లి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు స్టేషన్ కు వెళ్లారు. దీంతో యువతి బంధువులు సుమారు 50 మంది ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ప్రేమ జంటను బయటకు లాక్కొచ్చి కొడుతుండగా అడ్డుకున్న పోలీసులపైనా పూల కుండీలతో దాడికి పాల్పడ్డారు. దీంతో డ్యూటీలో ఉన్న మహిళా కానిస్టేబుల్ స్వర్ణ, మరో మహిళ స్వాతి గాయపడడంతో108లో చికిత్స కోసం నర్సంపేట ఏరియా ఆస్పత్రికి పంపించారు. స్టేషన్లో దాడి జరిగిన విషయం తెలియడంతో దుగ్గొండి సీఐ సాయి రమణ వెళ్లి విచారణ చేపట్టారు.