బిజినెస్ డెస్క్, వెలుగు: కరోనా దెబ్బతో అన్ని సెక్టార్ల మాదిరే మ్యాట్రిస్ (పరుపులు) ఇండస్ట్రీ కూడా తీవ్రంగా దెబ్బతింది. లాక్డౌన్ ప్రభావంతో ప్రొడక్షన్, సేల్స్ ఆగిపోయాయి. రిటైల్ షాపులకు జనాలు రావడం బంద్ అయింది. ఇండస్ట్రీలో డబ్బు కొరత తీవ్రంగా ఉందని ఇండియన్ స్లీప్ ప్రొడక్ట్ ఫెడరేషన్(ఐఎస్పీఎఫ్) పేర్కొంది. కొత్తగా అప్పులు పుట్టడం కష్టమవుతోందని, ఇప్పటికే అప్పులిచ్చిన వారు వడ్డీలు కట్టమని ఒత్తిడి తెస్తున్నారని తెలిపింది. వీటికి తోడు ఉద్యోగులకు జీతాలివ్వడం వంటి ఖర్చులు ఉన్నాయని చెప్పారు. ప్రజల లైఫ్స్టైల్లో మార్పొస్తోందని, దీనికి అనుగుణంగా ఇండస్ట్రీ మారాల్సిన అవసరం ఉందని ఐఎస్పీఎఫ్ సెక్రటరీ శ్రీనివాసన్ సుందరేశన్ అన్నారు.ప్రభుత్వం నుంచి సాయం కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు.
ఎదుర్కోవడంలోనే అవకాశం..
కరోనా దెబ్బకు రిటైల్ అమ్మకాలు పూర్తిగా తగ్గిపోయాయి. కానీ ఆన్లైన్ అమ్మకాలు పుంజుకుంటున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. వీటికి తోడు ప్రజలు ఇళ్లలో ఉండడం ఎక్కువై, వారు తమ కంఫర్ట్ను పెంచుకోవాలనుకుంటున్నారని ఆ వర్గాలు తెలిపాయి. దీని కోసం తమ మ్యాట్రిస్లను అప్గ్రేడ్ చేసుకోవాలని చూస్తున్నారని, మ్యాట్రిస్ తయారీ కంపెనీలకు ఇదొక మంచి అవకాశమని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి. మ్యాట్రిస్ తయారీ కంపెనీలు తమ మార్కెటింగ్ స్ట్రాటజిని మరింత మెరుగుపరచాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డాయి. ఆన్లైన్లో కూడా మ్యాట్రిస్లు అందుబాటులో ఉన్నాయనే విషయాన్ని ప్రజలకు తెలిసేలా ప్రచారం చేయాలని పేర్కొన్నాయి. డిజిటల్ ఛానెల్స్లో విస్తరించడానికి మ్యాట్రిస్ కంపెనీలకు ఇదొక మంచి అవకాశమని, ఇన్నోవేటివ్ ఆలోచనలతో కస్టమర్లను ఆకర్షించాలని సలహా ఇస్తున్నాయి.
కరోనా దెబ్బతో కస్టమర్ల ట్రస్ట్ను తిరిగి పొందడం మ్యాట్రిస్ కంపెనీలకు కీలకంగా మారింది. కస్టమర్ ఇంటికి చేరిన ప్రొడక్ట్ శుభ్రంగా, వైరస్ ఫ్రీగా ఉందనే నమ్మకాన్ని వినియోగదారుడికి కలిగించాల్సిన అవసరం ఉందని ఎనలిస్టులు చెబుతున్నారు. వైరస్, బ్యాక్టీరియాలను చంపేసే కోటింగ్ను మ్యాట్రిస్లపై ఉపయోగించాలని సలహాయిస్తున్నారు. దీంతో కస్టమర్లకు ప్రొడక్ట్పై నమ్మకం పెరుగుతుందన్నారు.
లాక్డౌన్ తర్వాత పరిస్థితేంటి..
క్రెడిట్ సేల్స్ పడిపోతాయని ఐఎస్పీఎఫ్ పేర్కొంది. లిక్విడిటీ కొరత వల్ల క్యాష్ సేల్స్కే తయారీదారులు పెద్ద పీట వేస్తారని తెలిపింది. ఆన్లైన్లో మ్యాట్రిస్ అమ్మకాలు పెరుగుతాయని అంచనావేసింది. హెల్త్కేర్ను దృష్టిలో పెట్టుకొని ప్రొడక్ట్ తయారీ, సప్లయ్ ఉంటాయని పేర్కొంది. ఇమ్యూనిటీ బెడ్స్ వంటి కొన్ని ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ రావొచ్చని తెలిపింది.
లాక్డౌన్ దెబ్బతో ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోయింది. కానీ ఇంకో రెండు నెలల్లో సాధారణ స్థాయికి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. కస్టమర్ల ట్రస్ట్ను తిరిగి పొందడానికి శుభ్రత, సేఫ్టీపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నాం. ప్రభుత్వ స్టిమ్యులస్ ప్యాకేజిపై సానుకూలంగా ఉన్నాం. ప్రభుత్వం చేయాల్సినంతలో మంచి ప్యాకేజి ప్రకటించింది. ఎంఎస్ఎంఈలు, రైతులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది.
– జీ. శంకర్ రామ్
పెప్స్ మ్యాట్రిస్ జాయింట్ ఎండీ