
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలనే డిమాండ్తో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఐ) నేతలు హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి యత్నించారు. ర్యాలీగా వస్తున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకోగా.. తోపులాట చోటు చేసుకున్నది.
ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు మినిస్టర్స్ కార్టర్స్ గేట్ల ముందు బైఠాయించడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రజనీకాంత్ మాట్లాడుతూ ఆరేండ్లుగా పెండింగ్లో ఉన్న రూ.8,158 కోట్ల ఫీజు బకాయిలను రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. కేజీబీవీలు, గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో మెస్, కాస్మెటిక్ చార్జీలు రిలీజ్ చేయాలన్నారు. కేజీబీవీలు, ఎస్సీ గురుకులాల్లో యూనిఫామ్స్, టెక్ట్స్ బుక్స్ పూర్తిస్థాయిలో ఇవ్వాలన్నారు.