
- విద్యుత్, ఇరిగేషన్, ఆర్థిక స్థితిపై అసెంబ్లీలో మూడురోజులు చర్చ
- మీడియా సమావేశంలోషబ్బీర్ అలీ వెల్లడి
- వీలైనంత త్వరగా నామినేటెడ్ పోస్టుల భర్తీ: సంపత్కుమార్
హైదరాబాద్, వెలుగు: ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారంటీలను ఇప్పటికే అమలు చేస్తున్నామని, మిగతా గ్యారంటీలను ఎప్పుడు, ఏయే తేదీల్లో అమలు చేస్తామో అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి ప్రకటిస్తారని పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ అన్నారు. పీఏసీ సమావేశం అనంతరం ఆయన సంపత్ కుమార్తో కలిసి గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాల్సిందిగా కోరుతున్నట్లు తెలిపారు. గతంలో మెదక్ నుంచి ఇందిరా గాంధీ పోటీ చేశారని గుర్తు చేశారు. పీఏసీ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక, విద్యుత్ శాఖ పరిస్థితులను భట్టి విక్రమార్క వివరించారని అన్నారు. ఇరిగేషన్ అవకతవకలపై మంత్రి ఉత్తమ్ మాట్లాడారని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.95 వేల కోట్లు ఖర్చు చేసినా.. 95 వేల ఎకరాలు కూడా సాగులోకి రాలేదన్నారు. పథకాల అమలులో కాంగ్రెస్ కార్యకర్తలకూ ప్రాధాన్యం ఉంటుందన్నారు. విద్యుత్, ఇరిగేషన్, ఆర్థిక స్థితిపై అసెంబ్లీలో మూడు రోజుల పాటు చర్చ ఉంటుందని ఆయన చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను గెలుచుకుంటామని ఏఐసీసీ సభ్యుడు సంపత్ కుమార్ అన్నారు. ఎన్నికలకు తమ కార్యాచరణ వెంటనే షురూ అవుతుందని స్పష్టం చేశారు. నామినేటెడ్ పదవుల టర్మ్ రెండేండ్లు కావడంతో.. ప్రస్తుత ప్రభుత్వంలో రెండు సార్లు భర్తీ చేసే అవకాశం ఉంటుందని, వీలైనంత త్వరగా నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని తెలిపారు.