ముందే కత్తి కొని పెట్టుకుని పక్కా ప్లాన్​తోనే చంపేసిండు!

ముందే కత్తి కొని పెట్టుకుని పక్కా ప్లాన్​తోనే చంపేసిండు!

 

  • నిందితుడిలో పశ్చాత్తాపం కనిపించట్లే
  • సాహిల్​ను విచారిస్తున్న ఢిల్లీ పోలీసులు
  • రెండు రోజుల రిమాండ్​ విధించిన ఢిల్లీ కోర్టు

న్యూఢిల్లీ: ఢిల్లీలోని షహదాబ్ డెయిరీ ఏరియాలో జరిగిన పదహారేండ్ల బాలిక సాక్షి హత్య కేసులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. పక్కా ప్లాన్ ప్రకారమే సాక్షిని సాహిల్ హత్య చేశాడని వివరించారు. పదిహేను రోజుల కిందే కత్తి కొన్నాడని వెల్లడించారు. ‘‘సాక్షిని చంపినందుకు సాహిల్ పశ్చాత్తాపం చెందడంలేదు. విచారణలో తరచూ మాట మారుస్తూ కన్​ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కోపంలో చంపేశానని ఒకసారి, తనను పట్టించుకోవట్లేదనే ఆవేదనతో చంపానని మరొకసారి, మాజీ బాయ్​ఫ్రెండ్​తో టచ్​లో ఉండటంతోనే మర్డర్ చేశానని ఇంకో స్టేట్​మెంట్ ఇస్తున్నాడు” అని పోలీసులు వివరించారు. సాక్షి శరీరంపై మొత్తం 34 చోట్ల గాయాలున్నాయని, రాయితో కొట్టడం వల్ల పుర్రె పగిలిపోయిందని తెలిపారు.

మా ఇన్​ఫార్మర్​ వల్లే తెలిసింది: పోలీసులు

‘‘కత్తి ఎప్పుడు కొన్నాడు? ఎక్కడ కొన్నాడు? అనే విషయాలపై ఎంక్వైరీ చేస్తున్నాం” అని ఎంక్వైరీ ఆఫీసర్ వివరించారు. సాక్షిని హత్య చేశాక సాహిల్ యూపీలోని బులంద్​షహర్​కు పారిపోయాడు. అక్కడి నుంచి తన అత్తయ్య, తండ్రికి ఫోన్ చేశాడు. దీంతో లొకేషన్ ట్రేస్ అయ్యింది. మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత సాహిల్​ను సోమవారం అర్ధరాత్రి పోలీసులు ఢిల్లీకి తీసుకొచ్చారు. మంగళవారం ఉదయం ఢిల్లీ కోర్టులో ప్రొడ్యూస్​ చేశారు. కోర్టు రెండు రోజుల రిమాండ్ విధించింది. ‘‘సాక్షిని చంపేసిన 25 నిమిషాల వరకు ఎవరూ మాకు ఇన్​ఫామ్ చేయలేదు. చుట్టుపక్క వాళ్లు కనీసం పీసీఆర్ కాల్ కూడా చేయలేదు. మా ఇన్​ఫార్మర్ మర్డర్ గురించి చెప్పాడు. రాత్రి తొమ్మిదిన్నరకు స్పాట్​కు చేరుకున్నాం” అని పోలీసులు వివరించారు.

కఠినంగా శిక్షించాలి: శమ్మో, సాహిల్ అత్తయ్య

చేసిన నేరానికి సాహిల్​కు తగిన శిక్ష విధించాలని అతని అత్తయ్య శమ్మో పోలీసులను కోరారు. ఇది క్షమించరాని నేరమన్నారు. ‘‘ఈ రోజు ఆ అమ్మాయిని చంపేశాడు. రేపు మాతో కూడా అలాగే చేస్తాడు..” అని శమ్మో పోలీసులకు వివరించారు. ‘‘రెండు చేతులు జోడించి చెబుతున్నాం. అతడికి ఎలాంటి శిక్ష విధించినా సరే, అతడితో మాకు సంబంధంలేదు” అని తేల్చి చెప్పారు.

మాటేసి మట్టుబెట్టిండు

సాక్షిని చంపే ముందు సాహిల్ తన ఫ్రెండ్​తో మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో పక్కా ప్లాన్ ప్రకారమే సాహిల్​ ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది. సాక్షిని చంపిన స్పాట్​లోనే ఆకాశ్ అనే ఫ్రెండ్​తో సాహిల్ కొద్దిసేపు మాట్లాడాడు. ఆమె కోసం కాపు కాశాడు. వచ్చాక చంపేసి పరారయ్యాడు.