
హైదరాబాద్: సరస్వతి పుష్కరాలకు విస్తృత ఏర్పాట్లు చేపట్టామని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి శైలజా రామయ్యర్ తెలిపారు. గురువారం (మే 15) నుంచి పుష్కరాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బుధవారం (మే 14) ఆమె సరస్వతి ఘాట్ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. 2025, మే15 నుంచి 26వ తేదీ వరకు జరిగే సరస్వతి పుష్కరాల సందర్భంగా వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఆమె తెలిపారు. గురువారం (మే 15) సీఎం రేవంత్ రెడ్డి సరస్వతి మాతా విగ్రహం, ఘాట్ ప్రారంభోత్సవం చేస్తారని.. అనంతరం పుష్కర స్నానమాచరించి స్వామి వారిని దర్శించుకుంటారని చెప్పారు.
అలాగే.. త్రివేణి సంగమంలో మొట్టమొదటి సారిగా కాశీ పండితులు నిర్వహించనున్న నదీ హారతిలో సీఎం పాల్గొంటారని పేర్కొన్నారు. తెలంగాణలో మొట్ట మొదటిసారిగా పెద్ద ఎత్తున పుష్కరాలు నిర్వహిస్తున్నామని, జిల్లా యంత్రాంగం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, భక్తుల పట్ల గౌరవంగా వ్యవహరించాలని సూచించారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని.. అందుకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు.