మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని శామీర్ పేట పోలీస్ స్టేషన్ దేశ వ్యాప్తంగా సత్తా చాటింది. కేంద్ర హోంశాఖ ఎంపిక చేసిన ఉత్తమ పోలీస్ స్టేషన్లలో శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ కు ఏడవ స్థానం దక్కింది. తెలంగాణలో మొదటి స్థానాన్ని సాధించింది. పోలీస్ స్టేషన్ పనితీరు, రికార్డుల నిర్వహణ, బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం, ఫిర్యాదులకు సమయానుకూల పరిష్కారం చూపించడం వంటి అంశాలను మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పరిగణనలోకి తీసుకుంది.
స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, గార్డెనింగ్, ఉత్తమ సీసీటీఎన్ఎస్ పని, సిబ్బంది నైపుణ్యం వంటి అంశాలు కూడా పరిశీలనలో ఉన్నాయి. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా 10 ఉత్తమ పోలీస్ స్టేషన్లను ఎంపిక చేసే ఈ ప్రక్రియలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్కు చెందిన శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ రాష్ట్రంలో అగ్రస్థానాన్ని, దేశంలో ప్రతిష్టాత్మకమైన ఏడో ర్యాంకును సాధించడం విశేషం. ఈ సందర్భంగా మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి, ఏడీసీపీ మేడ్చల్ పురుషోత్తం, ఏసీపీ మేడ్చల్ బాలగంగిరెడ్డి, శామీర్ పేట్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్తో పాటు సిబ్బందిని అభినందించారు.
