
చైతన్య రావు(Chaitanya Rao), భూమి శెట్టి(Bhumi Shetty) జంటగా కుమారస్వామి(Kumaraswamy) (అక్షర) తెరకెక్కించిన చిత్రం షరతులు వర్తిస్తాయి(Sharathulu Varthisthayi). నాగార్జున సామల, శ్రీష్ కుమార్ గుండా, డా. కృష్ణకాంత్ చిత్తజల్లు నిర్మించారు. శనివారం ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన దిల్ రాజు మాట్లాడుతూ ‘టీజర్ బాగుంది. మా ‘బలగం’ కంటే ఎక్కువ తెలంగాణ నేటివిటీతో, ఒక మంచి కాన్సెప్ట్తో తీశారు. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్’ అన్నారు. దర్శకుడు వేణు ఊడుగుల మాట్లాడుతూ ‘రెండేళ్ల క్రితమే ఈ స్క్రిప్ట్ చదివా. ఒక గొప్ప అనుభూతి కలిగించింది. మిడిల్ క్లాస్, వెనుక బడిన ప్రజల లైఫ్ స్టైల్ని, స్థానికత ఉట్టిపడేలా తెరకెక్కించారు.
సమాజంలో ఒక చర్చకు దారి తీసే సినిమా అవుతుంది’ అని చెప్పారు. సహజమైన కథా కథనాలతో రూపొందిన సినిమా ఇదని మామిడి హరికృష్ణ అన్నారు. హీరో చైతన్య రావ్ మాట్లాడుతూ ‘మాది కరీంనగర్. నటుడు అయ్యాక మళ్లీ కరీంనగర్ వెళ్లి అక్కడ షూటింగ్ చేయడం ఓ అచీవ్మెంట్లా అనిపించింది. ఒక సున్నితమైన కథకు, కమర్షియల్ ఎలిమెంట్స్ చేర్చుతూ అందరికీ నచ్చేలా కుమారస్వామి ఈ సినిమా తీశారు’ అని చెప్పాడు. ‘నేనొక కన్నడ అమ్మాయిని. ఈ సినిమా కోసం తెలుగుతో పాటు తెలంగాణ యాస నేర్చుకున్నా. కరీంనగర్లో షూటింగ్ చేశాం’ అని చెప్పింది. దర్శకుడు కుమారస్వామి మాట్లాడుతూ ‘ప్రేక్షకులు మంచి సినిమాను ఎప్పుడూ ఆదరిస్తారు. మా సినిమాలో కంటెంట్ ఉంది. జనం ఆదరణ కూడా దక్కుతుందని ఆశిస్తున్నా’ అన్నాడు. సమాజంలోని ఓ సమస్యను ఇందులో చర్చించినట్టు నిర్మాత డా. కృష్ణకాంత్ అన్నారు. డైలాగ్, లిరిక్ రైటర్ పెద్దింటి అశోక్ కుమార్, నటి పద్మావతి తదితరులు పాల్గొన్నారు.