రాష్ట్రంలో లాక్ డౌన్ ఎత్తివేసినా సినిమా షూటింగ్ లు చేయడం అంత త్వరగా సాధ్యం కాదన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. వచ్చే నెలలో పరిశ్రమ వర్గాలతో చర్చించాకే సినీ ఇండస్ట్రీపై ప్రభుత్వ నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ ప్రకటిస్తారన్నారు. కరోనా ప్రభావంతో దెబ్బతిన్న చిత్రపరిశ్రమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు నారాయణదాస్ నారంగ్ తోపాటు నిర్మాతల మండలి అధ్యక్ష, కార్యదర్శకులు సి.కల్యాణ్, దిల్ రాజు, ప్రసన్నకుమార్, సునీల్ నారంగ్, విజయేందర్ రెడ్డిలు ఫిల్మ్ చాంబర్ లో మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పరిశ్రమవర్గాల విజ్ఞప్తులపై స్పందించిన మంత్రి తలసాని… సినీపరిశ్రమకు అన్ని విధాల ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చారు. లాక్ డౌన్ తర్వాత సినీ పరిశ్రమపై ప్రత్యేకపాలసీని తీసుకురానున్నట్లు తలసాని తెలిపారు.