
ఏర్పాటు చేయనున్న టెక్ఎమ్, మహీంద్రా యూనివర్సిటీ
హైదరాబాద్, వెలుగు: క్వాంటమ్ కంప్యూటింగ్, మెటావర్స్ , ఏఐలో రీసెర్చ్, డెవెలప్మెంట్ కోసం టెక్ మహీంద్రా, మహీంద్రా యూనివర్సిటీ 'మేకర్స్ ల్యాబ్'ని ఏర్పాటు చేసేందుకు అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. టెక్ మహీంద్రాకు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 10 మేకర్స్ ల్యాబ్లు ఉన్నాయి. హైదరాబాద్లో ఏర్పాటవుతున్న యూనిట్ పదకొండవది అని మహీంద్రా యూనివర్సిటీ తెలిపింది. ఈ సందర్భంగా టెక్ మహీంద్రా ఎండీ, సీఈఓ సీపీ గుర్నానీ మాట్లాడుతూ క్వాంటమ్ కంప్యూటింగ్ అభివృద్ధిపై ఫోకస్ చేయాలని అన్నారు. క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సెంటర్లు, 5జీకి సంబంధించిన ప్రస్తుత కంప్యూటింగ్ సిస్టమ్లో మార్పుల ద్వారా ఇండస్ట్రీకి ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. మహీంద్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ యాజులు మేదురి మాట్లాడుతూ, ఎంఓయులో గొప్ప విషయం ఏమిటంటే ఇది విద్యాసంస్థలు-పరిశ్రమల సహకారంతో ముందుకు సాగుతుందని చెప్పారు. "మాకు క్వాంటమ్ ఫిజిక్స్, ఏఐలలో చాలా మంది ఫ్యాకల్టీలు ఉన్నారు. వీళ్లంతా టెక్ మహీంద్రాతో కలిసి పని చేయగలుగుతున్నారు. పరిశ్రమకు అవసరమైన పనులపై ఫోకస్ చేస్తున్నారు” అని వివరించారు. ఈ ఎంఓయూ ప్రకారం మహీంద్రా యూనివర్సిటీ విద్యార్థులు మేకర్స్ ల్యాబ్లో తయారు చేసిన ఇంటెలెక్చువల్ ప్రాపర్టీలపై, క్యాంపస్లోని ఆర్&డీ ప్రాజెక్ట్లపై పనిచేస్తారు. ప్రాజెక్ట్లు, ఇంటర్న్షిప్లు, ఉపాధి అవకాశాలను దక్కించుకోవడానికి యూనివర్సిటీలోని “ఎంజిమా” వంటి కోడింగ్ గ్రూప్స్కు కూడా సహకరిస్తారు. టెక్ మహీంద్రా గ్లోబల్ హెడ్ ఆఫ్ మేకర్స్ ల్యాబ్, నిఖిల్ మల్హోత్రా మాట్లాడుతూ క్వాంటమ్ కంప్యూటింగ్ చాలా ప్రారంభ దశలో ఉందని, రాబోయే రోజుల్లో ఎంతో డెవెలప్ అవుతుందని అన్నారు. కార్యక్రమంలో మహీంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్రా, మంత్రి కేటీఆర్ తదితరులు పాల్గొన్నారు.