
- విరాట్ కోహ్లీ విషయంలో సైలెంట్గా బీసీసీఐ
న్యూఢిల్లీ: రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఇండియా టెస్టు క్రికెట్లో నాయకత్వ మార్పులకు రంగం సిద్ధమైంది. హిట్మ్యాన్ వారసుడిగా శుభ్మన్ గిల్ టెస్టు ఫార్మాట్లో కొత్త కెప్టెన్గా ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్కు వైస్ కెప్టెన్సీ అప్పగించాలని బీసీసీఐ, టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. 25 ఏండ్ల గిల్ ఇప్పటికే వన్డేల్లో వైస్ కెప్టెన్గా సేవలందిస్తున్నాడు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్కు నాయకత్వం వహించి మంచి ఫలితాలు సాధించాడు. టాలెంటెడ్ బ్యాటర్ కావడంతో కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, పంత్తో పోటీలో అతనికే మొగ్గు కనిపిస్తోంది. బుమ్రా ఫిట్నెస్ సమస్యల కారణంగా గిల్ను లాంగ్టర్మ్ కెప్టెన్గా పరిశీలిస్తున్నారు. అదే సమయంలో ఈ ఫార్మాట్లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా వంటి దేశాల్లో పంత్ అద్భుతంగా రాణించడంతో వైస్ కెప్టెన్సీకి తను సరిపోతాడన్న అభిప్రాయాలు ఉన్నాయి.
ఫారిన్ పిచ్లపై అతని బ్యాటింగ్ టాలెంట్, టీమ్కు సపోర్ట్గా నిలిచే లక్షణాలు తనకు అనుకూలంగా మారాయి. ప్రస్తుత వైస్ కెప్టెన్, రోహిత్ గైర్హాజరీలో బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో రెండు మ్యాచ్ల్లో జట్టును నడిపించిన బుమ్రాను ఆ బాధ్యతల నుంచి తప్పించాలని చూస్తున్నారు. ఫిట్నెస్ సమస్యల కారణంగా పూర్తి సిరీస్లకు అతను అందుబాటులో ఉండటం సందేహాస్పదం కావడమే ఇందుకు కారణం అవుతోంది. తనను ఫుల్ టైమ్ కెప్టెన్గా పరిగణించకపోవడానికి కూడా ఇదే అడ్డంకిగా మారుతోంది. బుమ్రా కెప్టెన్ కాకపోతే అతనికి వైస్ -కెప్టెన్సీ ఇవ్వడంలో అర్థం లేదని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. కేఎల్ రాహుల్ను కెప్టెన్సీకి పరిగణించడం లేదని తెలిసింది. 33 ఏండ్లు దాటిన రాహుల్ కెరీర్లో నిలకడ ప్రధాన సమస్యగా ఉంది. ఆస్ట్రేలియాలో బాగా ఆడినప్పటికీ 11 ఏండ్ల టెస్ట్ కెరీర్లో 50 మ్యాచ్లలో తన సగటు 35 కంటే తక్కువ ఉంది. ఇంగ్లండ్ టూర్ కోసం ఇండియా టీమ్ను ఈ నెల మూడో వారంలో ప్రకటించనున్నారు. వచ్చే వారంలో ఇండియా–ఎ టీమ్ను ప్రకటించే చాన్సుంది. డొమెస్టిక్ క్రికెట్, ఐపీఎల్లో అదరగొడుతున్న తమిళనాడు లెఫ్టార్మ్ బ్యాటర్ సాయి సుదర్శన్ ఇంగ్లండ్ టూర్కు ఎంపికవడం ఖాయమే అనిపిస్తోంది. అంతా బాగుంటే తను ఓపెనర్గా లేదా మూడో నంబర్లో బ్యాటింగ్ చేయవచ్చు.
కోహ్లీ నిర్ణయంతో షాక్
విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవ్వాలని అనుకోవడం క్రికెట్ వర్గాలు ఆశ్చర్యపోయాయి. ఒకదశలో ఇంగ్లండ్ సిరీస్లో అతనికి కెప్టెన్సీ ఇచ్చి.. గిల్కు లీడర్షిప్ స్కిల్స్ నేర్చుకునేందుకు సమయం ఇవ్వాలని సెలెక్షన్ కమిటీ ఆలోచించినట్లు తెలిసింది. ప్రస్తుతం కోహ్లీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినా ఆలోచనను బోర్డు పెద్దలు, సెలెక్టర్లతో పంచుకున్నాడు. అయితే, ఇంగ్లండ్లోని కఠిన పరిస్థితుల్లో అతని అనుభవం అవసరమని, రోహిత్ శర్మ టెస్ట్ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో కోహ్లీని ఈ ఐదు టెస్ట్ల సిరీస్లో ఆడాలని కోరనున్నారు. ప్రస్తుతానికి కోహ్లీ టెస్ట్ కెరీర్ గురించి బీసీసీఐ మౌనంగా ఉంది. ‘సెలెక్టర్లు ఇంగ్లండ్ సిరీస్కు కోహ్లీని కెప్టెన్గా చేయాలని అనుకున్నారు. తద్వారా గిల్ను నాయకత్వ పాత్ర కుదురుకునేందుకు తగిన సమయం లభించేది. గిల్ వయసు 25 ఏండ్లే. తనింకా ఆటలో టాప్ ప్లేస్కు చేరలేదు. కానీ, బుమ్రా ఫిట్నెస్ సమస్యల కారణంగా, అజిత్ అగర్కర్ కమిటీకి గిల్ స్పష్టమైన ఎంపికగా కనిపిస్తున్నాడు’ అని బోర్డు వర్గాలు చెప్పాయి.