IND vs ENG 2025: అప్పుడు, ఇప్పుడు ఒకటే ఫార్ములా: ఆసక్తికరంగా టీమిండియా కెప్టెన్, వైస్ కెప్టెన్‌ల స్థానాలు

IND vs ENG 2025: అప్పుడు, ఇప్పుడు ఒకటే ఫార్ములా: ఆసక్తికరంగా టీమిండియా కెప్టెన్, వైస్ కెప్టెన్‌ల స్థానాలు

ఇంగ్లాండ్ తో 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు టీమిండియా సిద్ధమవుతుంది. శుక్రవారం (జూన్ 20) లీడ్స్ వేదికగా హెడ్డింగ్లీలో తొలి టెస్ట్ జరగనుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా ప్లేయింగ్ 11 ఆసక్తికరంగా మారింది. 19 మంది భారత స్క్వాడ్ లో ఎవరికి తుది జట్టులో స్థానం దక్కుతుందో అని ఫ్యాన్స్ ఎదురు చూపులు చూస్తున్నారు. కోహ్లీ, రోహిత్ శర్మ, రవి చంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఎవరు తొలి టెస్టు ప్లేయింగ్ 11లో ఆడతారో చెప్పడం కష్టంగా మారింది. ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్ లో ఎవరు బరిలోకి దిగుతారో పెద్ద తల నొప్పిగా మారింది. 

బుధవారం మీడియాతో మాట్లాడిన వైస్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌ రిషబ్‌‌‌‌ పంత్‌‌‌‌.. బ్యాటింగ్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌పై కొద్దిగా క్లారిటీ ఇచ్చాడు. ముఖ్యంగా కోహ్లీ రిటైర్మెంట్‌‌‌‌తో ఏర్పడిన నాలుగో నంబర్‌‌‌‌ ఖాళీని ఎవరు భర్తీ చేస్తారనే చర్చకు ఫుల్‌‌‌‌స్టాప్‌‌‌‌ పెట్టాడు. లీడ్స్‌‌‌‌లో జరిగే తొలి మ్యాచ్‌‌‌‌లో కెప్టెన్‌‌‌‌ శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌ నాలుగో నంబర్‌‌‌‌లో బ్యాటింగ్‌‌‌‌కు దిగుతాడని స్పష్టం చేశాడు.  ఐదో స్థానంలో తానే బ్యాటింగ్ చేస్తాడని పంత్ స్వయంగా వెల్లడించాడు. దీంతో రెండు స్థానాలపై సస్పెన్స్ వీడింది. దీని ప్రకారం ఓపెనర్లుగా యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్ బరిలోకి దిగడం దాదాపు ఖాయమైంది. 

గిల్, పంత్ వరుసగా నాలుగు ఐదు స్థానాల్లో బ్యాటింగ్ కు రావడం ఆసక్తికరంగా మారింది. కోహ్లీ కెప్టెన్సీలో వైస్ కెప్టెన్ రహానే గతంలో ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసేవాడు. కోహ్లీ నాలుగో స్థానంలో బ్యాటింగ్ ఆడేవాడు. ప్రస్తుతం జరగబోయే ఇంగ్లాండ్ సిరీస్ లో కూడా కెప్టెన్ గిల్ నాలుగో స్థానంలో.. వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ ఐదో స్థానంలో బ్యాటింగ్ ఆడబోతుండడం విశేషం. కోహ్లీ కెప్టెన్ గా, రహానే వైస్ కెప్టెన్ గా భారత్ 2016-2021 మధ్య కాలంలో చారిత్రాత్మక విజయాలను నమోదు చేసుకుంది. వీరిద్దరిలాగే మరోసారి అదే ఫార్ములా ఫాలో అవుతున్న గిల్, పంత్ టీమిండియాకు ఎలాంటి విజయాలు అందిస్తారో చూడాలి. 

టెస్ట్ సిరీస్ లో భాగంగా లీడ్స్‌లోని హెడ్డింగ్లేలో జూన్ 20 న తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. సిరీస్‌లోని మిగతా నాలుగు టెస్టులకు ఎడ్జ్‌బాస్టన్, లార్డ్స్, ఓల్డ్ ట్రాఫోర్డ్ ఓవల్ వేదికలు కానున్నాయి. 2021-22 చివరిసారిగా భారత్ ఇంగ్లాండ్ లో పర్యటించింది. ఈ సిరీస్ 2-2 తో సమంగా ముగిసింది. 2024 ప్రారంభంలో ఇంగ్లాండ్, భారత్ చివరిసారిగా టెస్ట్ సిరీస్ ఆడాయి. ఈ సిరీస్ ను భారత్ 4-1 తేడాతో గెలుచుకుంది. 2007 నుంచి ఇంగ్లండ్‌‌‌‌లో టెస్ట్‌‌‌‌ సిరీస్‌‌‌‌ గెలవలేదు. గత పదేళ్లుగా రోహిత్‌‌‌‌, కోహ్లీ, బుమ్రా, అశ్విన్‌‌‌‌ పోరాడినా విజయాలు మాత్రమే దక్కాయి. దీంతో ఈసారి ఎలాగైనా సిరీస్‌‌‌‌ను నెగ్గాలన్న పట్టుదలతో టీమిండియా బరిలోకి దిగుతోంది. 

ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ 2025 టెస్ట్ సిరీస్ షెడ్యూల్

1వ టెస్ట్: జూన్ 20-24 - హెడ్డింగ్లీ, లీడ్స్
2వ టెస్టు: జూలై 2-6 - ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్
3వ టెస్టు: జూలై 10-14 - లార్డ్స్, లండన్
4వ టెస్టు: జూలై 23-27 - ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్
5వ టెస్టు: జూలై 31-ఆగస్టు 4 - కియా ఓవల్, లండన్