ఫోన్​ ట్యాపింగ్​ కేసులో 5న సిట్ ​ముందుకు ప్రభాకర్​రావు.. సుప్రీం ఆదేశాలతో విచారణకు సిద్ధం

ఫోన్​ ట్యాపింగ్​ కేసులో 5న సిట్ ​ముందుకు ప్రభాకర్​రావు.. సుప్రీం ఆదేశాలతో విచారణకు సిద్ధం
  • వన్ టైం పాస్​పోర్టు వచ్చిన 3 రోజుల్లోనే హాజరు
  • ఇండియాకు వచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్న ప్రభాకర్ రావు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఫోన్ ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌ కేసు దర్యాప్తు చివరి దశకు చేరుకున్నది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన స్పెషల్‌‌‌‌‌‌‌‌ ఇంటెలిజెన్స్  బ్రాంచ్‌‌‌‌‌‌‌‌(ఎస్‌‌‌‌‌‌‌‌ఐబీ) మాజీ చీఫ్‌‌‌‌‌‌‌‌ ప్రభాకర్ రావు ఈ నెల 5న సిట్ విచారణకు హాజరుకానున్నారు. ఈ మేరకు ఇప్పటికే సిట్ అధికారులకు సమాచారం అందించాడు. సిట్‌‌‌‌‌‌‌‌విచారణకు పూర్తిగా సహకరిస్తానని సుప్రీంకోర్టుకు అండర్ టేకింగ్‌‌‌‌‌‌‌‌పత్రాలు సమర్పించాడు. ముందస్తు బెయిల్‌‌‌‌‌‌‌‌ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావుకు గత గురువారం ఊరట లభించిన సంగతి తెలిసిందే. 

ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావును అరెస్ట్ చేయకుండా విచారించాలని సిట్‌‌‌‌‌‌‌‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే వన్‌‌‌‌‌‌‌‌టైం ఎంట్రీ పాస్‌‌‌‌‌‌‌‌పోర్టు కోసం ప్రభాకర్ రావు గత 2 రోజులుగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను సంప్రదిస్తున్నట్లు తెలిసింది. సుప్రీంకోర్టు ఆదేశాల్లో పేర్కొన్న విధంగా పాస్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ అందిన తర్వాత 3 రోజుల్లోనే సిట్‌‌‌‌‌‌‌‌ముందు హాజరుకానున్నారు. ఈ క్రమంలో ఇండియా వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా అమెరికాలోని ఇండియన్ ఎంబసీ ద్వారా మరో రెండు రోజుల్లోగా ఇండియాకు వచ్చి   సిట్‌‌‌‌‌‌‌‌ముందు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

14 నెలలపాటు అమెరికాలో తలదాచుకొని..

నిరుడు మార్చి 10న ఫోన్‌‌‌‌‌‌‌‌ట్యాపింగ్ కేసు నమోదైన తర్వాత  ప్రభాకర్ రావు అమెరికాకు పారిపోయిన సంగతి తెలిసిందే.  లుకౌట్​ సర్క్యులర్, నాన్‌‌‌‌‌‌‌‌ బెయిలబుల్ వారెంట్, పాస్‌‌‌‌‌‌‌‌పోర్టు రద్దు, వీసా గడువు కూడా ముగియడంతోపాటు ప్రభాకర్ రావుపై రెడ్‌‌‌‌‌‌‌‌కార్నర్ నోటీస్ కూడా జారీ అయ్యింది.  గత 14 నెలలుగా ప్రభాకర్ రావు అమెరికాలో తలదాచుకున్నాడు. క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాకు వచ్చినట్లు నాంపల్లి కోర్టు సహా హైకోర్టులో అఫిడవిట్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేశాడు. రాజకీయ కుట్రలో భాగంగా తనను అరెస్ట్ చేయాలని చూస్తున్నారని, రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అమెరికా ప్రభుత్వాన్ని ఆశ్రయించాడు. 

కాగా, ఈ కేసులో  అరెస్ట్ అయిన మాజీ పోలీసులు ప్రణీత్‌‌‌‌‌‌‌‌రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావుకు బెయిల్‌‌‌‌‌‌‌‌ మంజూరు కావడంతోపాటు ఆరో నిందితుడైన శ్రవణ్‌‌‌‌‌‌‌‌రావుకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ప్రభాకర్​రావు హైకోర్టును ఆశ్రయించాడు. విచారణకు సహకరిస్తానని ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థించాడు.  ప్రభాకర్ రావు దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌‌‌‌‌ను మే 2న రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. 

దీంతో సుప్రీంకోర్టులో అప్పీల్‌‌‌‌‌‌‌‌ చేసుకున్నాడు. ముందస్తు బెయిల్‌‌‌‌‌‌‌‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు..ప్రభాకర్ రావును అరెస్ట్ చేయకుండా విచారించాలని సిట్‌‌‌‌‌‌‌‌ను ఆదేశించింది. ముందస్తు బెయిల్‌‌‌‌‌‌‌‌పై ఆగస్టు 5న విచారణ జరుపుతామని కోర్టు తెలిపింది. అప్పటివరకు ప్రభాకర్ రావుపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా విచారించి, కేసు స్టేటస్‌‌‌‌‌‌‌‌ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌ సమర్పించాలని ఆదేశించింది.