25న శాకాంబరి పౌర్ణమి.. ఉపవాసంతో పూజలు చేస్తే మంచిదంట..!

25న శాకాంబరి పౌర్ణమి.. ఉపవాసంతో పూజలు చేస్తే మంచిదంట..!

 పౌర్ణమి తిథిని అత్యంత పవిత్రమైన తిథిగా భావిస్తారు. ఏడాదిలో వచ్చే 12 పౌర్ణమిలలో కొన్ని పౌర్ణమిలు అత్యంత ముఖ్యమైనవి. వాటిలో ఒకటి పుష్యమాస పౌర్ణమి. ఈ రోజు విశిష్టత ఏంటి? ఏం చేయాలి? మరి ఈ ఏడాది పుష్య పౌర్ణమి ఎప్పుడు వచ్చింది..? పూజా విధానం.. వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

 హిందూ సంప్రదాయంలో పుష్య పౌర్ణమికి ప్రత్యేకత ఉంది.  పుష్య మాసంలోని శుక్లపక్షం పౌర్ణమి తిథి నాడు పుష్య పౌర్ణమి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. పురాణాల ప్రకారం ఈరోజు సూర్య భగవానుడిని పూజించడం, దానధర్మాలు చేయడం, లక్ష్మీ దేవిని ఆరాధించడం వల్ల జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయి.. ఇంట్లో సుఖసంతోషాలతో పాటు ఐశ్వర్యం లభిస్తుందని ఒక నమ్మకం. 

పుష్య పౌర్ణమి తిథి

పంచాంగం ప్రకారం.. జనవరి 25వ తేదీన పుష్య పౌర్ణమిని జరుపుకోనున్నారు. పుష్య పూర్ణిమ తిథి జనవరి 24, 2024న రాత్రి 9:49 గంటలకు ప్రారంభమయ్యి.. మరుసటి రోజు అంటే 25 జనవరి 2024 రాత్రి 11:23 గంటలకు ముగుస్తుంది. పంచాంగ ప్రకారం ఉదయం తిథిని లెక్కలోకి తీసుకుంటారు కాబట్టి.. 25న పుష్య పూర్ణిమ జరుపుకోనున్నారు. పైగా ఈ ఏడాది మొదటి పౌర్ణమి ఇది.

 కొన్ని ప్రదేశాలలో, పుష్య పౌర్ణమిని ‘శాకంబరి జయంతి’గా కూడా జరుపుకుంటారు. ఈ రోజు దుర్గాదేవిని శాకంబరీ దేవిగా అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. భూమిపై కరువు, తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని తగ్గించడానికి దుర్గా దేవి శాకంబరిగా అవతరించిందని నమ్ముతారు. అందుకే కూరగాయలు, పండ్లు,  హరిత వర్ణ ఆకులతో అమ్మవారిని అలంకరించి పూజిస్తారు. ఛత్తీస్‌గఢ్‌లోని గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు అమ్మవారిని ఆకులతో అలంకరిస్తారు. దీనిని అక్కడి గిరిజనులు 'చార్తా పండుగ'(పంటల పండుగ) అంటారు.

పుష్య పూర్ణిమ విశిష్టత

పుష్యమాసంలో పౌర్ణమి రోజు నదీస్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు నదీస్నానం, లక్ష్మీ  పూజ, దాన ధర్మాలు చేస్తే.. గతజన్మలో పాపాలు, ఈ జన్మలో ఇప్పటివరకూ చేసిన పాపాలు తొలగిపోయి..మోక్షానికి మార్గం సుగమం అవుతుందని భక్తుల విశ్వాసం.

 పుష్య పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని కలువ పూలతో పూజించడం వల్ల అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారని.. ఆ ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుందని.. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. ఈ పౌర్ణమి నాడు చాలా మంది తమ ఇళ్లల్లో సత్యనారాయణ స్వామి  పారాయణం చేస్తారు.

పుష్య పూర్ణిమ పూజా విధానం

  • తెల్లవారుజామున నిద్రలేచి ఇళ్లు శుభ్రం చేసుకోవాలి.
  • తర్వాత నదీ స్నానం చేసి సూర్య భగవానుడిని ఆరాధించాలి.
  • అనంతరం పూజ గదిలో లక్ష్మీదేవి, శ్రీ మహా విష్ణువును పూజించాలి.
  • పూలు ముఖ్యంగా కలువ పూలతో పూజించాలి. అలాగే పండ్లు, దీప, ధూప, నైవేద్యాలతో స్వామి, అమ్మవార్లను ఆరాధించాలి.
  • లక్ష్మీదేవి శ్లోకం, కనకధార స్తోత్రం, శ్రీ సూక్త, విష్ణుసహస్త్రాణం పారాయణం చేయాలి.

లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం

  • ఇక ఆరోజు ఉపవాసం ఉండి సాయంత్రం పూట మరోసారి పూజ చేసుకోవాలి.
  • ఆ తర్వాత చంద్రుడిని పూజించి.. ఉపవాసం విరమించాలి.

లక్ష్మీదేవిని కలువపూలతో పూజించండి

పుష్య పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని కలువ పూలతో పూజించడం వల్ల అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారు. ఆ ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెబుతారు. 

వేద జ్యోతిషశాస్త్రం మరియు హిందూ విశ్వాసాల ప్రకారం పుష్యమాసం పౌర్ణమి నుంచి సూర్య భగవానుడి వేడి పెరుగుతూ వస్తుంది. మాఘ మాసం ప్రారంభమైనప్పటి నుంచీ ఆ వేడి మరింత పెరుగుతుంది. అందుకే ఈ పౌర్ణణి రోజు నదీస్నానం ఆచరించి సూర్య, చంద్రులను పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం. ఈ రోజు దానధర్మాలు చేస్తారు, మోక్షాన్ని పొందేందుకు ఉపవాసం ఉంటారు. ఈ రోజు చేసే దాన ధర్మాలు వేటికైనా అపారమైన ఫలితాలుంటాయి. 

పుష్య పౌర్ణమి నాడు శుభ కార్యాలు

పుష్య పౌర్ణమి రోజు దేశవ్యాప్తంగా వివిధ తీర్థయాత్రలు , పవిత్ర నగరాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ రోజు శ్రీ మహావిష్ణువును ఆరాధించేవారు కొందరు, పరమేశ్వరుడిని దర్శించుకునేవారు మరికొందరు...సత్యనారాయణ వ్రతాలు ఆచరించేవారు ఇంకొందరు. ఈ రోజు భగవద్గీత , రామాయణం చదవడం కూడా కొందరు పాటిస్తారు. ఈ పుష్య పౌర్ణమి రోజు శ్రీకృష్ణుని ఆలయాలలో విశేషమైన పూజలు నిర్వహిస్తారు. 

పుష్య పౌర్ణమి రోజు ( జనవరి 25) ప్రత్యేక యోగాలు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఇదే రోజు పునర్వసు నక్షత్రం, సర్వార్థ సిద్ధి యోగం, రవియోగం, గురు పుష్యా యోగాలు కలవబోతున్నాయి. కాబట్టి ఈ సమయంలో నదీ స్నానం చేయడమే కాకుండా దానధర్మాలు చేయడం వల్ల అనేక రకాల ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.