వసంత పంచమి  రోజున సరస్వతి దేవిని ఎందుకు పూజించాలో తెలుసా

వసంత పంచమి  రోజున సరస్వతి దేవిని ఎందుకు పూజించాలో తెలుసా

మాఘ మాసంలోని శుక్ల పక్ష పంచమి తిథి ఫిబ్రవరి 14 న వస్తుంది. ఆ రోజున వసంత పంచమి పండుగను జరుపుకుంటారు. ఈ రోజున జ్ఞానానికి దేవత అయిన సరస్వతి తల్లిని పూజిస్తారు. ఇలా చేయడం వల్ల శారదా దేవి సంతోషించి తన భక్తులకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తుందని నమ్మకం. ఆ  రోజున ప్రజలు తమ ఇళ్లలో రుచికరమైన వంటకాలు, స్వీట్లను తయారు చేసి పసుపు బట్టలు ధరించి అమ్మవారిని కొలుస్తారు. అంతే కాదు కొంతమంది సరస్వతీ పూజ రోజున ఉపవాసాన్ని కూడా పాటిస్తారు. అయితే ఈ ఉపవాసాన్ని ఎలా పూర్తి చేయాలి, ఉపవాస సమయంలో ఏం తినాలో ఇప్పుడు తెలుసుకుందాం

హిందూమతంలో చదువుల తల్లి సరస్వతి దేవికి వసంత పంచమి రోజు చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. దీనిని శ్రీ పంచమి, సరస్వతీ పంచమి అని కూడా అంటారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న వసంత పంచమి పండుగను జరుపుకోనున్నారు. వసంత పంచమి రోజున సరస్వతీ దేవిని పూజించడం ద్వారా తెలివితేటలు, చదువులో విజయాలు లభిస్తాయని నమ్ముతారు. వసంత పంచమి పండుగ రోజున విష్ణువు, సరస్వతిని పూజించే సంప్రదాయం ఉంది. ఈ రోజున ఉదయం స్నానం చేసి, పసుపు బట్టలు ధరించి, ధూప దీపం, నైవేద్యంలతో పాటు కుంకుమతో అభిషేకం చేయాలి.

సరస్వతి దేవి ఆరాధనకు ముందు గణపతిని పూజించి, అటుపై శారదాంబ ప్రతిమను, పుస్తకాలను, పెన్నుని ఆరాధించాలి. షోడశోపచారాలతో సరస్వతిని పూజించాలి. పూజ అనంతరం సరస్వతి దేవికి పరమాన్నం,  పులిహోరని నైవేద్యంగా సమర్పించాలి. వసంత పంచమి రోజున సంగీతం, లలిత కళలు, గానం, రచన మొదలైనవాటిని ప్రారంభిస్తే జీవితంలో తప్పకుండా విజయం సాధిస్తారు. వసంత పంచమి రోజున విద్యాభ్యాసం చేయించడం ద్వారా సరస్వతీ దేవీ అనుగ్రహం లభిస్తుందని పండితులు చెప్తున్నారు

వసంత పంచమి ఉపవాస సమయంలో ఏమి తినాలి ?

వసంత పంచమి నాడు ఉపవాసం ఉన్నట్లయితే స్నానం చేయకుండా, సరస్వతిని పూజించకుండా ఏమీ తినకూడదు.
వసంత పంచమి రోజు మొత్తం ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. ఆ రోజున, మీరు సరస్వతీ దేవిని శుభ సమయంలో పూజించిన తర్వాత మీ ఉపవాసాన్ని విరమించవచ్చు.
ఉపవాసాన్ని విరమించే ముందు, మీరు సరస్వతీ దేవిని పూజించాలి. ఆమెకు ఇష్టమైన పండు రేగును తిని ఉపవాసం విరమించాలి.
ఉపవాసం విరమించాక సరస్వతీ దేవికి నైవేద్యంగా పెట్టిన ఆహారాన్ని అందరికీ పంచాలి.
ఆ రోజున పసుపు మిఠాయిలు, కుంకుమపువ్వుతో చేసిన పసుపు అన్నం తినాలి.
ఉపవాసం సమయంలో తీపి అన్నం, మాల్ పువా, బూందీ లడ్డూలు, కాలానుగుణ పండ్లు మొదలైనవి కూడా తినవచ్చు.

వసంత పంచమి ఉపవాస సమయంలో ఏమి తినకూడదు ?

ఉపవాసం ఉన్నపుడు తామసిక ( మసాలాతో తయారు చేసిన ) వస్తువులు తినకండి.
ఆహారంలో ఉల్లి, వెల్లుల్లి వాడకూడదు.
సాత్విక ఆహారాన్ని తినాలి. స్పైసీ ఫుడ్ తినడం మానుకోవాలి.
వసంత పంచమి రోజున సరస్వతి తల్లి ఖచ్చితంగా ఒక వ్యక్తి పెదవుల పై కనిపిస్తుందని చెబుతారు. అందుకే ఈరోజు శుభకరమైన మాటలు మాత్రమే మాట్లాడాలి.

వసంత పంచమి శుభ సమయం

పంచాంగం ప్రకారం మాఘ మాసంలోని శుక్ల పక్ష పంచమి తిథి ఫిబ్రవరి 13న మధ్యాహ్నం 02:41 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 14వ తేదీ మధ్యాహ్నం 12:09 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం, ఈసారి వసంత పంచమి ఫిబ్రవరి 14 న జరుపుకుంటారు. ఈ  రోజు ఉదయం 7:01 నుండి మధ్యాహ్నం 12:35 గంటల మధ్య సరస్వతీ దేవిని పూజించవచ్చు.