సింగరేణిలో ప్లాస్టిక్ వాడకం బంద్..సంస్థ సీఎండీ బలరామ్ ప్రకటన

సింగరేణిలో ప్లాస్టిక్ వాడకం బంద్..సంస్థ సీఎండీ బలరామ్ ప్రకటన
  • ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: ప్లాస్టిక్​​పై సింగరేణి సంపూర్ణ నిషేధం ప్రకటించింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సింగరేణి సీఎండీ ఎన్. బలరామ్ వెల్లడించారు.హైదరాబాద్ కార్యాలయంతోపాటు సంస్థ ఆధ్వర్యంలోని అన్ని ఏరియాల్లో ప్లాస్టిక్ బాటిల్స్, ప్లేట్లు, క్యారీ బ్యాగ్​లు ఇతర వస్తువుల వాడకాన్ని పూర్తిగా నిలిపివేయాలని స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్‌‌లోని సింగరేణి భవన్ ప్రాంగణంలో పర్యావరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా సీఎండీ మొక్కలు నాటారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. సంస్థలో అధికారులు, ఉద్యోగులు, కార్మికులు ప్లాస్టిక్ నిషేధానికి సహకరించాలని, ఇంట్లో కూడా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని కోరారు. పర్యావరణ రక్షణ కోసం సంస్థ అనేక చర్యలు చేపడుతోందని తెలిపారు.  కొన్ని ప్రాంతాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని ఇప్పటికే నిలిపివేసినప్పటికీ, ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవ నినాదాన్ని దృష్టిలో ఉంచుకుని నిషేధం అమలు చేస్తున్నట్లు చెప్పారు. పర్యావరణం పట్ల అభిమానంతో తాను స్వయంగా సింగరేణి వ్యాప్తంగా 19 వేల మొక్కలు నాటానని వెల్లడించారు.

దీనిని స్ఫూర్తిగా తీసుకుని డైరెక్టర్లు, కార్మికులు మొక్కలు నాటడం ప్రారంభించారని సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ కనీసం మూడు మొక్కలు నాటాలని, ఆసక్తి ఉన్నవారికి సింగరేణి సంస్థ ఉచితంగా మొక్కలు పంపిణీ చేస్తుందన్నారు. మూడు దశాబ్దాల క్రితం సింగరేణి ప్రాంతాల్లో ఎండాకాలంలో 50 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యేవని, విస్తృతంగా మొక్కలు నాటడంతో అవి అడవులుగా మారి, ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు తగ్గాయని బలరామ్ వివరించారు. కార్యక్రమంలో ఈడీ (కోల్ మూమెంట్) సుభానీ, జీఎం రాజశేఖర్ రావు తదితరులు పాల్గొన్నారు.