నస్పూర్, వెలుగు: క్రీడలతో మానసిక ప్రశాంతత కలుగుతుందని శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్ తెలిపారు. గురువారం సాయంత్రం ప్రగతి స్టేడియంలోని సీఈఆర్ క్లబ్ లో 2025–26 సింగరేణి వార్షిక క్రీడల బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సింగరేణి ఇంటర్ డిపార్ట్మెంటల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో విజేతలు, క్రీడాకారులు, కళాకారులను అభినందించారు. ఉద్యోగులు ఆరోగ్యంగా, మానసికంగా ధృడంగా ఉన్నప్పుడే సంస్థ అభివృద్ధి సాధ్యమని తెలిపారు. శ్రీరాంపూర్ క్రీడాకారులు, కళాకారులకు సింగరేణి స్థాయిలోనే కాకుండా కోల్ ఇండియా, జాతీయ స్థాయిలో గుర్తింపు ఉందన్నారు.
ఉద్యోగుల రిక్రియేషన్ కోసం సంస్థ పరిధిలో క్రీడాప్రాంగణాలు, క్లబ్లు, స్విమింగ్ పూల్స్, జిమ్లు, పార్కులు, వాకింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎస్వో టు జీఎం ఎన్. సత్యనారాయణ, ఏఐటీయూసీ నాయకులు బాజీ సైదా, డీజీఎం(పి) ఎస్. అనిల్ కుమార్ , అర్కే న్యూటెక్ మేనేజర్ కూరపాటి శ్రీనివాస్ పాల్గొన్నారు.
