
- కోల్ బెల్ట్ లో డిజాస్టర్ విమెన్స్ సెక్యూరిటీ ఫోర్స్ ఏర్పాటు
- సంస్థలో తొలిసారిగా రెస్క్యూలో ట్రైనింగ్
గోదావరిఖని, వెలుగు : మహిళా ఉద్యోగులకు సైతం రెస్క్యూ ట్రైనింగ్ ఇచ్చి విపత్కర పరిస్థితుల్లో వారి సేవలు అందించేందుకు సింగరేణి సంస్థ చర్యలు చేపట్టింది. ఇటీవల అండర్ మేనేజర్లు(మేనేజ్ మెంట్ ట్రైనీ)గా నియమితులై భూగర్భగనులు, ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లో పని చేస్తున్న మహిళా ఆఫీసర్లతో విపత్తు(డిజాస్టర్) రక్షక దళం ఏర్పాటు చేశారు. గని ప్రమాదాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ చేసేందుకు పెద్దపల్లి జిల్లా యైటింక్లయిన్ కాలనీలోని రెస్క్యూ సెంటర్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. సంస్థలో తొలిసారిగా రెస్క్యూలో మహిళా ఉద్యోగులకు ట్రైనింగ్ ఇవ్వడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
చారిత్రాత్మక ముందడుగు..
గతంలో సింగరేణి కార్మికుడు చనిపోతే ఆ కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు.. అతని భార్య లేక కూతురుకు ఉద్యోగం ఇచ్చేవారు. జనరల్ మజ్దూర్గా అవకాశం కల్పించి ఆఫీసుల్లో పని చేయించుకునేవారు. కానీ, నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సింగరేణి నిర్వహించే వివిధ పోటీ పరీక్షల్లో మహిళలు పాల్గొనిఉద్యోగాలు సాధిస్తున్నారు. ఇటీవల మైనింగ్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన మహిళలు సింగరేణిలో అండర్ మేనేజర్లు(మేనేజ్మెంట్ ట్రైనీ)గా సెలెక్ట్ అయ్యారు.
వీరు ప్రస్తుతం భూగర్భగనులు, ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లోపని చేస్తున్నారు. పురుషులతో సమానంగా పని చేస్తున్న వీరిలో ధైర్యవంతులను ఎంపిక చేసి రెస్క్యూ టీమ్ఏర్పాటు చేయాలని సింగరేణి సీఎండీ బలరాం నిర్ణయించారు. ఇందులోభాగంగా ఇటీవల సింగరేణి వ్యాప్తంగా పని చేస్తున్న 28 మంది మహిళా ఆఫీసర్లను రెస్క్యూ శిక్షణకు ఎంపిక చేశారు. వీరిలో 13 మందితో కూడిన తొలి బ్యాచ్కు శిక్షణ
మొదలైంది.
ఎన్సీఎల్, డబ్ల్యూసీఎల్కు దీటుగా..
కోల్ ఇండియా పరిధిలోని నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్(ఎన్సీఎల్ -సింగ్రౌలీ, మధ్యప్రదేశ్), వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్(డబ్ల్యూసీఎల్ నాగ్పూర్, మహారాష్ట్ర)లో రెస్క్యూలో మహిళలకు శిక్షణ ఇవ్వగా, వారు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో సింగరేణిలో మహిళా ఆఫీసర్లు, ఉద్యోగుల నియామకం పెరగడంతో ఎన్సీఎల్, డబ్ల్యూసీఎల్ టీమ్లకు దీటుగా రెస్క్యూలో శిక్షణ ఇప్పించి మంచి టీమ్ తయారు చేయాలని మేనేజ్మెంట్ నిర్ణయించింది.
ఇందులోభాగంగా 30 ఏండ్ల లోపు వయసు ఉన్న మహిళా ఉద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేశారు. గోదావరిఖని ఆర్జీ–1, ఆర్జీ–2, శ్రీరాంపూర్, భూపాలపల్లి, కొత్తగూడెం ఏరియాలకు చెందిన 13 మందితో కూడిన తొలి బ్యాచ్కు 16 రోజుల శిక్షణ ప్రారంభించారు. ట్రైనింగ్లో భాగంగా మైనింగ్ థియరీ, గ్యాసెస్, గ్యాస్ డిటెక్టర్స్, ఫస్ట్ ఎయిడ్, రెస్క్యూ రికవరీ, ఫైర్ ఫైటింగ్, ఫైర్ ఎక్జిస్టెన్స్, స్పెషలైజ్డ్ ఎక్యూప్మెంట్స్, తదితర అంశాలపై తర్ఫీదు ఇస్తున్నారు.
ధైర్యంగా పని చేసే వారితో రెస్క్యూ టీమ్..
సింగరేణిలో మహిళల రిక్రూట్మెంట్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ధైర్యంగా పని చేసే వారితో రెస్క్యూ టీమ్లను ఏర్పాటు చేసి ట్రైనింగ్ ఇస్తున్నాం. విపత్తు సమయంలో పురుషులే ఎక్కువగా కనిపిస్తారు. మహిళల్లోనూ స్ఫూర్తి నింపేందుకు ఈ ప్రయత్నం చేశాం. ఈ ప్రక్రియ సింగరేణి చరిత్రలోనే తొలిసారి. ట్రైనింగ్ తీసుకునేందుకు ముందుకు వచ్చిన మహిళా ఆఫీసర్లకు అభినందనలు. - ఎన్.బలరాం, సింగరేణి సీఎండీ
రెస్క్యూలో పని చేయడం గర్వంగా ఉంది..
-మాది ఇల్లందు. మొదట కానిస్టేబుల్గా ఉద్యోగం వచ్చింది. కొంత కాలం పని చేశాను. తర్వాత సింగరేణిలో మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ(ఎంజీటి) ఉద్యోగం కోసం ఎగ్జామ్ రాశాను. గోదావరిఖని వకీల్పల్లి మైన్లో అండర్ మేనేజర్గా పని చేసే అవకాశం వచ్చింది. పోలీస్ ట్రైనింగ్ సింగరేణి రెస్క్యూలో పని చేయడానికి ఉపయోగపడింది. సింగరేణి రెస్క్యూ టీమ్లో పని చేయడం గర్వంగా ఉంది.- బి.జీవన్మయి, ఎంజీటీ, వకీల్పల్లి మైన్, గోదావరిఖని
ప్రాణాలను కాపాడేందుకు సిద్ధం..
మాది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి. మొదట రాజస్థాన్లోని హిందూస్థాన్ జింక్ మైన్లో ఆరేండ్లు ఆఫీసర్గా పని చేశాను. ఇటీవల సింగరేణిలో మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ(ఎంజీటి) ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం కొత్తగూడెం పీవీకే–5 మైన్లో పని చేస్తున్నాను. మైన్లలో జరిగే ప్రమాదాల గురించి తెలుసు. అందులో చిక్కుకున్న వారిని కాపాడడానికి సిద్ధంగా ఉంటాను. దీనికోసం సింగరేణి ఇచ్చే ట్రైనింగ్ ఎంతో ఉపయోగపడుతుంది.
- కృష్ణవేణి, ఎంజీటీ, పీవీకే-5 మైన్, కొత్తగూడెం