సింగరేణిలో.. మహిళా రెస్క్యూ టీమ్

 సింగరేణిలో.. మహిళా రెస్క్యూ టీమ్
  • కోల్ బెల్ట్ లో డిజాస్టర్ విమెన్స్ సెక్యూరిటీ ఫోర్స్ ఏర్పాటు
  • సంస్థలో తొలిసారిగా రెస్క్యూలో ట్రైనింగ్

గోదావరిఖని, వెలుగు : మహిళా ఉద్యోగులకు సైతం రెస్క్యూ  ట్రైనింగ్​ ఇచ్చి విపత్కర పరిస్థితుల్లో వారి సేవలు అందించేందుకు సింగరేణి సంస్థ చర్యలు చేపట్టింది. ఇటీవల అండర్​ మేనేజర్లు(మేనేజ్​ మెంట్​ ట్రైనీ)గా నియమితులై భూగర్భగనులు, ఓపెన్​ కాస్ట్​ ప్రాజెక్టుల్లో పని చేస్తున్న మహిళా ఆఫీసర్లతో విపత్తు(డిజాస్టర్) రక్షక దళం ఏర్పాటు చేశారు. గని ప్రమాదాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ  చేసేందుకు పెద్దపల్లి జిల్లా యైటింక్లయిన్​ కాలనీలోని రెస్క్యూ సెంటర్​లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. సంస్థలో తొలిసారిగా రెస్క్యూలో మహిళా ఉద్యోగులకు ట్రైనింగ్ ఇవ్వడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

చారిత్రాత్మక ముందడుగు..

గతంలో సింగరేణి కార్మికుడు చనిపోతే ఆ కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు.. అతని భార్య లేక కూతురుకు ఉద్యోగం ఇచ్చేవారు. జనరల్​ మజ్దూర్​గా అవకాశం కల్పించి ఆఫీసుల్లో  పని చేయించుకునేవారు. కానీ, నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సింగరేణి నిర్వహించే వివిధ పోటీ పరీక్షల్లో మహిళలు పాల్గొని​ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఇటీవల మైనింగ్​ ఇంజినీరింగ్  పూర్తి చేసిన మహిళలు సింగరేణిలో అండర్​ మేనేజర్లు(మేనేజ్​మెంట్​ ట్రైనీ)గా సెలెక్ట్  అయ్యారు. 

వీరు ప్రస్తుతం భూగర్భగనులు, ఓపెన్​ కాస్ట్​ ప్రాజెక్టుల్లో​పని చేస్తున్నారు.  పురుషులతో సమానంగా పని చేస్తున్న వీరిలో ధైర్యవంతులను ఎంపిక చేసి రెస్క్యూ టీమ్​ఏర్పాటు చేయాలని సింగరేణి సీఎండీ బలరాం నిర్ణయించారు. ఇందులోభాగంగా ఇటీవల సింగరేణి వ్యాప్తంగా పని చేస్తున్న 28 మంది మహిళా ఆఫీసర్లను రెస్క్యూ శిక్షణకు ఎంపిక చేశారు. వీరిలో 13 మందితో కూడిన తొలి బ్యాచ్​కు శిక్షణ 
మొదలైంది.

ఎన్సీఎల్, డబ్ల్యూసీఎల్​కు దీటుగా..

కోల్​ ఇండియా పరిధిలోని నార్తర్న్​ కోల్​ ఫీల్డ్స్​ లిమిటెడ్(ఎన్సీఎల్​ -సింగ్రౌలీ, మధ్యప్రదేశ్), వెస్ట్రన్​ కోల్​ ఫీల్డ్స్​ లిమిటెడ్(డబ్ల్యూసీఎల్​  నాగ్​పూర్, మహారాష్ట్ర)లో రెస్క్యూలో మహిళలకు శిక్షణ ఇవ్వగా, వారు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో సింగరేణిలో మహిళా ఆఫీసర్లు, ఉద్యోగుల నియామకం పెరగడంతో ఎన్సీఎల్, డబ్ల్యూసీఎల్​ టీమ్​లకు దీటుగా రెస్క్యూలో శిక్షణ ఇప్పించి మంచి టీమ్​ తయారు చేయాలని మేనేజ్​మెంట్  నిర్ణయించింది. 

ఇందులోభాగంగా 30 ఏండ్ల లోపు వయసు ఉన్న మహిళా ఉద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేశారు. గోదావరిఖని ఆర్జీ–1, ఆర్జీ–2, శ్రీరాంపూర్, భూపాలపల్లి, కొత్తగూడెం ఏరియాలకు చెందిన 13 మందితో కూడిన తొలి బ్యాచ్​కు 16 రోజుల శిక్షణ ప్రారంభించారు. ట్రైనింగ్​లో భాగంగా మైనింగ్ థియరీ, గ్యాసెస్, గ్యాస్ డిటెక్టర్స్, ఫస్ట్  ఎయిడ్, రెస్క్యూ రికవరీ, ఫైర్  ఫైటింగ్, ఫైర్  ఎక్జిస్టెన్స్, స్పెషలైజ్డ్​ ఎక్యూప్​మెంట్స్, తదితర అంశాలపై తర్ఫీదు ఇస్తున్నారు.

ధైర్యంగా పని చేసే వారితో రెస్క్యూ టీమ్..

సింగరేణిలో మహిళల రిక్రూట్​మెంట్​ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ధైర్యంగా పని చేసే వారితో రెస్క్యూ టీమ్​లను ఏర్పాటు చేసి ట్రైనింగ్​ ఇస్తున్నాం. విపత్తు సమయంలో పురుషులే ఎక్కువగా కనిపిస్తారు. మహిళల్లోనూ స్ఫూర్తి నింపేందుకు ఈ ప్రయత్నం చేశాం. ఈ ప్రక్రియ సింగరేణి చరిత్రలోనే తొలిసారి. ట్రైనింగ్​ తీసుకునేందుకు ముందుకు వచ్చిన మహిళా ఆఫీసర్లకు అభినందనలు.   - ఎన్.బలరాం, సింగరేణి సీఎండీ 

రెస్క్యూలో పని చేయడం గర్వంగా ఉంది..

-మాది ఇల్లందు. మొదట కానిస్టేబుల్​గా ఉద్యోగం వచ్చింది. కొంత కాలం పని చేశాను. తర్వాత సింగరేణిలో మేనేజ్​మెంట్​ గ్రాడ్యుయేట్​ ట్రైనీ(ఎంజీటి) ఉద్యోగం కోసం ఎగ్జామ్​ రాశాను. గోదావరిఖని వకీల్​పల్లి మైన్​లో అండర్​ మేనేజర్​గా పని చేసే అవకాశం వచ్చింది. పోలీస్​ ట్రైనింగ్​ సింగరేణి రెస్క్యూలో పని చేయడానికి ఉపయోగపడింది. సింగరేణి రెస్క్యూ టీమ్​లో పని చేయడం గర్వంగా ఉంది.- బి.జీవన్మయి, ఎంజీటీ, వకీల్​పల్లి మైన్, గోదావరిఖని 

ప్రాణాలను కాపాడేందుకు సిద్ధం..

మాది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి. మొదట రాజస్థాన్​లోని హిందూస్థాన్​ జింక్​ మైన్​లో ఆరేండ్లు ఆఫీసర్​గా పని చేశాను. ఇటీవల సింగరేణిలో మేనేజ్​మెంట్​ గ్రాడ్యుయేట్​ ట్రైనీ(ఎంజీటి) ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం కొత్తగూడెం పీవీకే–5 మైన్​లో పని చేస్తున్నాను. మైన్లలో జరిగే ప్రమాదాల గురించి తెలుసు. అందులో చిక్కుకున్న వారిని కాపాడడానికి సిద్ధంగా ఉంటాను. దీనికోసం సింగరేణి ఇచ్చే ట్రైనింగ్​ ఎంతో ఉపయోగపడుతుంది.
- కృష్ణవేణి, ఎంజీటీ, పీవీకే-5 మైన్, కొత్తగూడెం