కొత్త మైన్స్​ వస్తేనే సింగరేణికి భవిష్యత్..అండర్​ గ్రౌండ్స్​ మైన్స్​ నష్టాల నివారణపై దృష్టి పెట్టాలి

కొత్త మైన్స్​ వస్తేనే సింగరేణికి భవిష్యత్..అండర్​ గ్రౌండ్స్​ మైన్స్​ నష్టాల నివారణపై దృష్టి పెట్టాలి
  • విధుల్లో నిర్లక్ష్యం, గైర్హాజరయ్యే కార్మికులపై కఠిన చర్యలు తీసుకోవాలి
  • కొత్తగూడెంలోని హెడ్డాఫీస్​లో సమీక్షా సమావేశంలో సీఎండీ బలరాం ఆదేశం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్త మైన్స్​ వస్తేనే ఇల్లెందు, మణుగూరు, బెల్లంపల్లి ఏరియాలకు భవిష్యత్ అని సింగరేణి  సీఎండీ ఎన్. బలరాం పేర్కొన్నారు. సింగరేణివ్యాప్తంగా అన్ని ఏరియాల జనరల్​మేనేజర్లతో కొత్తగూడెంలోని హెడ్డాఫీస్​లో మంగళవారం 10 గంటలకు పైగా నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని ఏరియాల్లో కొత్త మైన్స్​ఏర్పాటుకు ప్లాన్ లు  రూపొందించాలని, పర్మిషన్స్​ కోసం కృషి చేయాలని సూచించారు. శాంతి ఖని, అడ్రియాల లాంగ్​వాల్​ప్రాజెక్టులో నష్టాల నివారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. అండర్​గ్రౌండ్​మైన్స్​లో నష్టాల నివారణపై స్పెషల్​ ఫోకస్​పెట్టాలని,  విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే,  గైర్హాజరయ్యే కార్మికులపై కఠినంగా ఉండాలని ఆదేశించారు. అవసరమైతే విధుల నుంచి డిస్మిస్​ చేయాలని స్పష్టంచేశారు.    

నాణ్యత, సేఫ్టీకి ప్రాధాన్యత ఇవ్వాలని,  వ్యయాన్ని తగ్గించుకుంటేనే సంస్థకు మంచి భవిష్యత్  ఉంటుందన్నారు. కోల్​ట్రాన్స్​పోర్టులో ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా కవి జయరాజ్​ సింగరేణి ఆణిముత్యమని ప్రశంసించారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా సీఎం రేవంత్​ రెడ్డి జయరాజ్​కు రూ.కోటి నగదు అవార్డు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేస్తూ సన్మానించారు. ఈ సమావేశంలో డైరెక్టర్లు డి. సత్యనారాయణ, ఎల్​వీ. సూర్యనారాయణ, కె. వెంకటేశ్వర్లు, ఎగ్జిక్యూటీవ్​ డైరెక్టర్​ కోల్​ మూమెంట్​ సుభాని, సీపీపీ ఎ. మనోహార్​, అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లు, యూనియన్​ ప్రతినిధులు, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు.