
- విధుల్లో నిర్లక్ష్యం, గైర్హాజరయ్యే కార్మికులపై కఠిన చర్యలు తీసుకోవాలి
- కొత్తగూడెంలోని హెడ్డాఫీస్లో సమీక్షా సమావేశంలో సీఎండీ బలరాం ఆదేశం
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్త మైన్స్ వస్తేనే ఇల్లెందు, మణుగూరు, బెల్లంపల్లి ఏరియాలకు భవిష్యత్ అని సింగరేణి సీఎండీ ఎన్. బలరాం పేర్కొన్నారు. సింగరేణివ్యాప్తంగా అన్ని ఏరియాల జనరల్మేనేజర్లతో కొత్తగూడెంలోని హెడ్డాఫీస్లో మంగళవారం 10 గంటలకు పైగా నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని ఏరియాల్లో కొత్త మైన్స్ఏర్పాటుకు ప్లాన్ లు రూపొందించాలని, పర్మిషన్స్ కోసం కృషి చేయాలని సూచించారు. శాంతి ఖని, అడ్రియాల లాంగ్వాల్ప్రాజెక్టులో నష్టాల నివారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. అండర్గ్రౌండ్మైన్స్లో నష్టాల నివారణపై స్పెషల్ ఫోకస్పెట్టాలని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే, గైర్హాజరయ్యే కార్మికులపై కఠినంగా ఉండాలని ఆదేశించారు. అవసరమైతే విధుల నుంచి డిస్మిస్ చేయాలని స్పష్టంచేశారు.
నాణ్యత, సేఫ్టీకి ప్రాధాన్యత ఇవ్వాలని, వ్యయాన్ని తగ్గించుకుంటేనే సంస్థకు మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. కోల్ట్రాన్స్పోర్టులో ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా కవి జయరాజ్ సింగరేణి ఆణిముత్యమని ప్రశంసించారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి జయరాజ్కు రూ.కోటి నగదు అవార్డు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేస్తూ సన్మానించారు. ఈ సమావేశంలో డైరెక్టర్లు డి. సత్యనారాయణ, ఎల్వీ. సూర్యనారాయణ, కె. వెంకటేశ్వర్లు, ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ సుభాని, సీపీపీ ఎ. మనోహార్, అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లు, యూనియన్ ప్రతినిధులు, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు.