అవార్డుల్లో ఎస్టీపీపీ రికార్డ్ .. నాలుగేండ్లలో 53 అవార్డులు సొంతం

అవార్డుల్లో  ఎస్టీపీపీ రికార్డ్ .. నాలుగేండ్లలో 53 అవార్డులు సొంతం
  • థర్మల్, సోలార్, వాటర్ ఫ్లోటింగ్ సోలార్ విద్యుదుత్పత్తిలో మేటి
  • నేషనల్, సౌత్ జోన్ స్థాయిలో సంస్థకు గుర్తింపు
  • ఎస్టీపీసీ అభివృద్ధికి కాకా ఫ్యామిలీ తీవ్ర కృషి 

కోల్​బెల్ట్/జైపూర్, వెలుగు: సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (ఎస్టీపీపీ) విద్యుత్​ఉత్పత్తిలో జాతీయ స్థాయి అవార్డులను సొంతం చేసుకుంటోంది. ఉత్తమ ప్రతిభ, అత్యుత్తమ నిర్వహణ, మెరుగైన పద్ధతులతో దేశంలోని సుమారు వంద థర్మల్​ విద్యుత్ ​కేంద్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. మంచిర్యాల జిల్లా జైపూర్​ మండలం పెగడపల్లిలోని ఎస్టీపీపీ.. 2021 ఏప్రిల్​నుంచి ఇప్పటిదాకా నాలుగేండ్లలో జాతీయ, సౌత్​జోన్​స్థాయిలో 53 అవార్డులను కైవసం చేసుకుంది. మరోవైపు విద్యుత్ ఉత్పత్తిలో రారాజుగా నిలుస్తోంది. థర్మల్​తో పాటు సోలార్, వాటర్​ ఫ్లోటింగ్​ సోలార్​ ప్లాంట్ల ద్వారా పవర్ ​జనరేషన్​ చేస్తూ ప్రత్యేక గుర్తింపుతోనూ అవార్డులు సాధిస్తోంది. 

ప్రభుత్వ థర్మల్​ విద్యుత్ ​కేంద్రాల విభాగంలో అత్యుత్తమంగా100 శాతం ప్లాంట్​లోడ్​ఫ్యాక్టర్​(పీఎల్ఎఫ్)​ సాధించడంతో పాటు విద్యుత్ ఉత్పత్తితో రిలీజ్​అయ్యే ఫ్లై యాష్​ను సద్వినియోగం చేసుకుంటూ పలుమార్లు బెస్ట్​ ఫ్లైయాష్​ యుటిలైజేషన్​అవార్డులు సాధించింది.  పర్యావరణ మిత్ర ప్లాంటుగా, వాటర్​ఎఫీషియెన్స్​ ప్లాంట్​అవార్డులు, బెస్ట్​ పవర్​ ప్లాంట్​ఫర్​ఫార్మర్​ అవార్డులు దక్కించుకుంది.

 అదేవిధంగా ఎన్విరాన్ మెంట్ సస్టైనబిలిటీ,సేఫ్టీ, లీడర్​షిప్​, బిజినెస్​ లీడర్ ​షిప్​ ఎక్స్​లెన్స్, పవర్​ప్లాంట్​ పెర్మార్మెన్స్,సేవా, ఎనర్జీ ఎఫిషియన్సీ, జీరో లిక్విడ్​ డిశ్చార్జ్, పొల్యూషన్​ కంట్రోల్, గ్రీన్ టెక్​ఎన్విరాన్​మెంట్, క్లీన్​ఎనర్జీ ట్రైయిబ లైజర్​అవార్డులను సాధించింది. జాతీయ స్థాయిలో బెస్ట్​పీఎల్ఎఫ్​,టెక్నాలజీ, టార్గెట్​పవర్ జనరేషన్ రీచ్ అంశాల్లో కూడా అవార్డులు వరించాయి. సింగరేణి పవర్​ప్లాంట్​వివిధ కేటగిరిల్లో పలు అవార్డు లు సాధించడానికి ఉద్యోగులు, ఆఫీసర్లు, యాజమాన్యం సమష్టి కృషి ఉందని సీఎండీ బలరాం నాయక్​ పేర్కొన్నారు.  

 రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చుతూ..

ఎస్టీపీపీ రెండు యూనిట్లలో1200 మెగావాట్ల (2×600) సామర్థ్యంతో రోజువారీగా సరాసరి 28 మిలియన్​ యూనిట్ల పైగా విద్యుత్​ను ఉత్ప్తతి చేస్తోంది. రాష్ట్ర విద్యుత్ అవసరాలకు12శాతం పవర్​ను అందిస్తోంది. వందశాతం ప్లాంట్​ లోడ్​ ఫ్యాక్టర్​ సాధిస్తూ దేశవ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తోంది. 10 మెగావాట్ల సోలార్​పవర్, మరో 10 మెగావాట్ల వాటర్​ ఫ్లోటింగ్​ సోలార్​ పవర్ ప్లాంట్లను నిర్వహిస్తోంది. సెంట్రల్​ఎలక్ర్టిసిటీ రెగ్యులేటరీ కమిషన్​ ఒక మెగావాట్​ థర్మల్ ​విద్యుత్ ​ఉత్పత్తికి 3 ఘనపు మీటర్ల నీటిని వినియోగించాలని నిర్ణయించింది. 

ఎస్టీపీపీ 2.5 ఘనపు మీటర్ల నీటిని  వాడుతోంది.  నీటి పొదుపులోనూ 6 సార్లు జాతీయ, సౌత్ జోన్ లో ‘బెస్ట్​వాటర్ ​ఎఫీసియెంట్ అవార్డు’ సొంతం చేసుకుంది.  ఎస్టీపీపీలో విద్యుత్​ ఉత్పత్తికి బొగ్గును మండించిన తర్వాత రెండు రకాలుగా వచ్చే బూడిద పౌడర్  ను  ఫ్లైయాష్​, కొంత రవ్వలాగా వచ్చే బూడిద బాటమ్​యాష్​ పర్యావరణానికి నష్టం కలిగించేవి. కాగా.. వీటిని  రోడ్ల నిర్మాణం, ఇటుకల తయారీకి పూర్తిస్థాయిలో అందిస్తోంది. 100శాతం ఫ్లైయాష్​ వాడకంతో ఎస్టీపీపీకి పలు జాతీయ అవార్డులు దక్కాయి.  

మూడో ప్లాంట్ ఏర్పాటుకు మంత్రి వివేక్​ కృషి

ఎస్టీపీపీ ఏర్పాటులో కాకా ఫ్యామిలీ కృషి ఎంతో ఉంది. 2005లో కాంగ్రెస్​ సర్కార్​హయాంలో ఎస్టీపీపీ నిర్మాణం ప్రారంభించగా అప్పటి పెద్దపల్లి ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి, ఆయన కొడుకు అప్పటి కార్మికశాఖ మంత్రి గడ్డం వినోద్​ తమ వంతు కృషి చేశారు. 2009 –-2014 వరకు పెద్దపల్లి ఎంపీగా కాకా మరో కొడుకు, ప్రస్తుత రాష్ట్ర కార్మిక,మైనింగ్​ శాఖ మంత్రి గడ్డం వివేక్​ వెంకటస్వామి  కొత్త ఎస్టీపీపీ ఏర్పాటుకు చొరవ చూపారు. చెన్నూరు ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే ప్రత్యేక చొరవతీసుకొని సీఎం రేవంత్​రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

 ప్రభుత్వం స్పందించి ఎస్టీపీపీలో 80 శాతం కాంట్రాక్ట్​, ఔట్​సోర్సింగ్​ జాబ్​లకు స్థానికులకే చెందేలా జీవో జారీ చేసింది. ప్లాంట్​లో 800 మెగావాట్ల మూడో యూనిట్​ ఏర్పాటుతో నిరుద్యోగులకు జాబ్​లు కల్పించడంతో పాటు సింగరేణికి వందల కోట్ల ఆదాయం వస్తుందని వివేక్​వెంకటస్వామి అసెంబ్లీలో ప్రస్తావించి.. ప్లాంట్​ఏర్పాటుకు సర్కార్​ను ఒప్పించారు. దీంతో సుమారు రూ.7వేల కోట్లతో త్వరలో మూడో యూనిట్​నిర్మాణ పనులను ప్రారంభించనుంది.