ఇటీవల సీనియర్లు, ప్రజాప్రతినిధుల సీక్రెట్ మీటింగ్
తమకు కనీసం అపాయింట్మెంట్ ఇస్తలేరని ఆవేదన
వలసొచ్చినోళ్లకే పెద్దపీట వేస్తున్నారని అసంతృప్తి
ఇట్లయితే బీజేపీలోకి వెళ్లక తప్పదనే సంకేతాలు
విషయం తెలుసుకొని దిద్దుబాటు చర్యలకు దిగిన మంత్రి కేటీఆర్
మండలాల వారీగా హైదరాబాద్కు రావాలని లీడర్లకు పిలుపు
రాజన్న సిరిసిల్ల, వెలుగు: సిరిసిల్ల నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు పొలిటికల్ సర్కిల్లో హాట్టాపిక్లా మారాయి. పార్టీలో మొదటి నుంచీ ఉంటున్న తమకు మంత్రి కేటీఆర్ కనీస విలువ ఇవ్వట్లేదని, సమస్యలు చెప్పుకునేందుకు హైదరాబాద్ వెళ్తే అపాయింట్మెంట్ కూడాదొరకట్లేదని నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ సీనియర్లు, ప్రజాప్రతినిధులు కొన్నాళ్లుగా అసంతృప్తితో రగిలిపోతున్నారు. కాంగ్రెస్ నుంచి వలసొచ్చిన ఓ నలుగురు లీడర్ల మాటలనే చిన్న సారు వింటున్నారని, వాళ్లు చెప్పినట్టే నడుచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఇటీవల దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో బీజేపీ పుంజుకొని టీఆర్ఎస్ డీలా పడడంతో సిరిసిల్ల నియోజకవర్గంలోనిటీఆర్ఎస్ అసంతృప్త నేతలంతా ఒక్కసారిగా వాయిస్ రేజ్చేశారు. సిరిసిల్ల పక్క మండలంలోని ఓ మామిడితోటలో సీనియర్లు, ప్రజాప్రతినిధులంతా ఓ మీటింగ్ పెట్టారు. ఇకనైనా మంత్రి కేటీఆర్తమను పట్టించుకోకపోతే మూకుమ్మడిగా బీజేపీలోకి జంప్అవుతామని హెచ్చరించారు. విషయం తెలిసి మంత్రి కేటీఆర్ అలర్ట్ అయ్యారు.
వలసొచ్చినోళ్లకే పదవులు!
టీఆర్ఎస్లో మొదటి నుంచీ ఉంటున్నవారిని కాదని కాంగ్రెస్ నుంచి వలసొచ్చిన లీడర్లకే మంత్రి కేటీఆర్ ప్రియారిటీ ఇస్తున్నారని సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ సీనియర్లు, ప్రజాప్రతినిధులు కొద్దిరోజులు గా అసంతృప్తిలో ఉన్నారు. ఇందుకు తగినట్లే ఇటీవల నాలుగు మండలాల్లో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ లకు చైర్మన్ పదవులు ప్రకటించగా, అన్నీ కొండూరి రవీందర్రావు వర్గీయులకే దక్కాయి. అందులో ముగ్గురు కాంగ్రెస్ నుంచి వలస వచ్చినవారే. తాము పంపిన లిస్టును పూర్తిగా పక్కనపెట్టేయడంతో మిగిలిన లీడర్లు నారాజ్ అయ్యారు. ఇదిలా ఉంటే సిరిసిల్లలోని పద్మశాలీ కులానికి చెందిన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్కు స్టేట్లెవల్ పదవి ఇస్తామని నాలుగేండ్ల కింద కేటీఆర్ హామీ ఇచ్చి మరిచిపోయారు. దీనిపై ఆ కులానికి చెందిన నేతల్లో అసంతృప్తి నెలకొంది. దీనికి తోడు కేటీఆర్ మేనబావ చీటీ నర్సింగరావు తాను సిరిసిల్లలో తెలంగాణ ఉద్యమం కాలం నుంచి పని చేస్తున్నా ఇప్పటికీ ఒక్క పదవి ఇవ్వలేదని బహిరంగంగానే తన ఆవేదన వెళ్లగక్కుతున్నారు. ఇక ఊళ్లలో విలేజ్పార్కులు, శ్మశానాలు, డంప్యార్డులు, రైతువేదికలు కట్టి సర్కారు నుంచి ఫండ్స్ రాక అందరిలాగే టీఆర్ఎస్ సర్పంచులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫండ్స్ లేక ఊళ్లలో డెవలప్మెంట్ పనులు చేయలేకపోతున్నామని ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఆవేదన చెందుతున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో కనీసం ఎమ్మెల్యేల వద్ద తమ గోడు చెప్పుకొని కాస్త రిలాక్స్ అవుతున్నా సిరిసిల్ల నియోజకవర్గంలోని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు ఆ పరిస్థితి కూడా లేకుండా పోయింది. రెండోసారి గెలిచాక మంత్రి కేటీఆర్ సిరిసిల్ల సెగ్మెంట్కు రావడం తగ్గింది. ఒకవేళ వచ్చినా ఏవేవో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు పెట్టుకొని హడావుడిగా వెళ్లిపోతున్నారు. హైదరాబాద్లో కలుద్దామంటే
అపాయింట్మెంట్ దొరకట్లేదని సిరిసిల్ల లీడర్లు అంటున్నారు.
ఇటీవల సిరిసిల్ల నియోజవర్గంలోని టీఆర్ఎస్ సీనియర్లు, ప్రజాప్రతినిధులంతా తంగళ్లపల్లిలోని ఓ మామిడి తోటలో సమావేశమయ్యారు. మంత్రి కేటీఆర్కాంగ్రెస్ నుంచి వలసొచ్చిన ఆ నలుగురు లీడర్ల మాటలే వింటున్నారని, వాళ్లు చెప్పినవాళ్లకే పార్టీ, నామినేటెడ్ పదవులు ఇస్తున్నారని , మొదటి నుంచీ పార్టీలో ఉన్న తమను లెక్కచేయట్లేదని, కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదని చర్చించుకున్నారు. ఇలాగైతే తమ అనుచరులు, పార్టీ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని, ఇప్పటికీ కేటీఆర్స్పందించకపోతే మూకుమ్మడిగా బీజేపీలోకి పోవడం తప్ప తమ ముందు వేరే మార్గం లేదని కొందరు లీడర్లు మాట్లాడారు. ఈ విషయం కాస్తా మంత్రి కేటీఆర్ దృష్టికి చేరడంతో ఆయన నష్ట నివారణ చర్యలు ప్రారంభించారు. నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, సీనియర్లతో మాట్లాడేందుకు వారం రోజుల షెడ్యూల్ ప్రకటించి, ఆయా రోజుల్లో హైదరాబాద్ రావాలని ఆహ్వానం పంపారు. మంగళవారం తంగళ్లపల్లి మండలంలోని సర్పంచ్లు, ఎంపీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు, పార్టీ లీడర్లను ప్రగతిభవన్కు పిలిపించుకొని మాట్లాడారు. వారు చెప్పిన సమస్యలన్నీ విని, ఇకపై తాను అందరికీ అందుబాటులో ఉంటానని, ఏ విషయమైనా లీడర్లందరి అభిప్రాయాలు తీసుకున్నాకే ముందుకెళ్తానని కేటీఆర్ నచ్చజెప్పినట్లు తెలిసింది. ఎవరూ నారాజ్ కావొద్దని, పార్టీ మారే ఆలోచన మనసులోకి రానివ్వొద్దని సూచించినట్లు సమాచారం. బుధ, గురువారం భోగి, సంక్రాంతి ఉండడంతో ఈ నెల 15న గంభీరావుపేట, 16న ముస్తాబాద్, 17న ఎల్లారెడ్డిపేట, 18న సిరిసిల్ల టౌన్, అర్బన్ మండలాల ప్రజాప్రతినిధులు, పార్టీ లీడర్లతో భేటీ కానున్నారు. ఊహించని రీతిలో చిన్నసారు తమను ప్రగతిభవన్కు పిలిపించి తిండిపెట్టి, సమస్యలు విని, భుజాలపై చేతులేసి భరోసా ఇవ్వడంతో సిరిసిల్లలోని టీఆర్ఎస్లీడర్లు ఇప్పుడు ఖుషీగా ఉన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుండడమే కేటీఆర్లో మార్పునకు కారణమని బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. మొత్తంమీద మామిడి తోట సీక్రెట్ మీటింగ్వర్క్అవుట్ అయిందని చెప్పుకుంటున్నారు.