మమ్మల్ని ఖాతర్​ చేస్తలేరు.. కేటీఆర్​ తీరుపై సిరిసిల్ల టీఆర్​ఎస్​ లీడర్ల నారాజ్​

మమ్మల్ని ఖాతర్​ చేస్తలేరు.. కేటీఆర్​ తీరుపై సిరిసిల్ల టీఆర్​ఎస్​ లీడర్ల నారాజ్​

ఇటీవల సీనియర్లు, ప్రజాప్రతినిధుల సీక్రెట్​ మీటింగ్

తమకు కనీసం అపాయింట్​మెంట్​ ఇస్తలేరని ఆవేదన

వలసొచ్చినోళ్లకే పెద్దపీట వేస్తున్నారని అసంతృప్తి

ఇట్లయితే బీజేపీలోకి వెళ్లక తప్పదనే సంకేతాలు

విషయం తెలుసుకొని దిద్దుబాటు చర్యలకు దిగిన మంత్రి కేటీఆర్​

మండలాల వారీగా హైదరాబాద్​కు రావాలని లీడర్లకు పిలుపు

రాజన్న సిరిసిల్ల, వెలుగు: సిరిసిల్ల నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు పొలిటికల్​ సర్కిల్​లో హాట్​టాపిక్​లా మారాయి. ​పార్టీలో మొదటి నుంచీ ఉంటున్న తమకు మంత్రి కేటీఆర్ కనీస విలువ ఇవ్వట్లేదని, సమస్యలు చెప్పుకునేందుకు హైదరాబాద్​ వెళ్తే అపాయింట్​మెంట్ కూడా​దొరకట్లేదని నియోజకవర్గానికి చెందిన టీఆర్​ఎస్​ సీనియర్లు, ప్రజాప్రతినిధులు కొన్నాళ్లుగా అసంతృప్తితో రగిలిపోతున్నారు. కాంగ్రెస్​ నుంచి వలసొచ్చిన ఓ నలుగురు లీడర్ల మాటలనే చిన్న సారు వింటున్నారని, వాళ్లు చెప్పినట్టే నడుచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఇటీవల దుబ్బాక, జీహెచ్​ఎంసీ ఎలక్షన్స్​లో బీజేపీ పుంజుకొని టీఆర్​ఎస్​ డీలా పడడంతో సిరిసిల్ల నియోజకవర్గంలోని​టీఆర్​ఎస్​ అసంతృప్త నేతలంతా ఒక్కసారిగా వాయిస్​ రేజ్​​చేశారు. సిరిసిల్ల పక్క మండలంలోని ఓ మామిడితోటలో సీనియర్లు, ప్రజాప్రతినిధులంతా ఓ మీటింగ్​ పెట్టారు. ఇకనైనా మంత్రి కేటీఆర్​తమను పట్టించుకోకపోతే  మూకుమ్మడిగా బీజేపీలోకి జంప్​అవుతామని  హెచ్చరించారు. విషయం తెలిసి మంత్రి కేటీఆర్​ అలర్ట్​ అయ్యారు.

వలసొచ్చినోళ్లకే పదవులు!

టీఆర్​ఎస్​లో మొదటి నుంచీ ఉంటున్నవారిని కాదని ​కాంగ్రెస్​ నుంచి వలసొచ్చిన లీడర్లకే  మంత్రి కేటీఆర్ ప్రియారిటీ ఇస్తున్నారని సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన టీఆర్​ఎస్​ సీనియర్లు, ప్రజాప్రతినిధులు కొద్దిరోజులు గా అసంతృప్తిలో ఉన్నారు. ఇందుకు తగినట్లే ఇటీవల నాలుగు మండలాల్లో అగ్రికల్చర్​ మార్కెట్​ కమిటీ లకు చైర్మన్​ పదవులు ప్రకటించగా, అన్నీ కొండూరి రవీందర్​రావు వర్గీయులకే దక్కాయి. అందులో ముగ్గురు కాంగ్రెస్​ నుంచి వలస వచ్చినవారే. తాము పంపిన లిస్టును పూర్తిగా పక్కనపెట్టేయడంతో మిగిలిన లీడర్లు నారాజ్​ అయ్యారు. ఇదిలా ఉంటే సిరిసిల్లలోని పద్మశాలీ కులానికి చెందిన టీఆర్​ఎస్​ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్​కు స్టేట్​లెవల్​ పదవి ఇస్తామని నాలుగేండ్ల కింద  కేటీఆర్​ హామీ ఇచ్చి మరిచిపోయారు. దీనిపై ఆ కులానికి చెందిన నేతల్లో అసంతృప్తి నెలకొంది. దీనికి తోడు కేటీఆర్​ మేనబావ చీటీ నర్సింగరావు తాను​ సిరిసిల్లలో తెలంగాణ ఉద్యమం కాలం నుంచి పని చేస్తున్నా ఇప్పటికీ ఒక్క  పదవి ఇవ్వలేదని బహిరంగంగానే తన ఆవేదన వెళ్లగక్కుతున్నారు. ఇక ఊళ్లలో విలేజ్​పార్కులు, శ్మశానాలు, డంప్​యార్డులు, రైతువేదికలు కట్టి సర్కారు నుంచి ఫండ్స్​ రాక అందరిలాగే టీఆర్​ఎస్​ సర్పంచులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫండ్స్​ లేక ఊళ్లలో డెవలప్​మెంట్​ పనులు చేయలేకపోతున్నామని ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఆవేదన చెందుతున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో కనీసం ఎమ్మెల్యేల వద్ద తమ గోడు చెప్పుకొని కాస్త రిలాక్స్​ అవుతున్నా సిరిసిల్ల నియోజకవర్గంలోని టీఆర్​ఎస్ ప్రజాప్రతినిధులకు ఆ పరిస్థితి కూడా లేకుండా పోయింది. రెండోసారి గెలిచాక మంత్రి కేటీఆర్​ సిరిసిల్ల సెగ్మెంట్​కు రావడం తగ్గింది. ఒకవేళ  వచ్చినా ఏవేవో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు పెట్టుకొని హడావుడిగా వెళ్లిపోతున్నారు. హైదరాబాద్​లో కలుద్దామంటే
అపాయింట్​మెంట్​ దొరకట్లేదని సిరిసిల్ల లీడర్లు అంటున్నారు.

ఇటీవల సిరిసిల్ల నియోజవర్గంలోని టీఆర్ఎస్​ సీనియర్లు, ప్రజాప్రతినిధులంతా తంగళ్లపల్లిలోని ఓ మామిడి తోటలో సమావేశమయ్యారు.  మంత్రి కేటీఆర్​కాంగ్రెస్​ నుంచి వలసొచ్చిన ఆ నలుగురు లీడర్ల మాటలే వింటున్నారని, వాళ్లు చెప్పినవాళ్లకే పార్టీ, నామినేటెడ్​ పదవులు ఇస్తున్నారని , మొదటి నుంచీ పార్టీలో ఉన్న తమను లెక్కచేయట్లేదని, కనీసం అపాయింట్​మెంట్​ కూడా ఇవ్వట్లేదని చర్చించుకున్నారు. ఇలాగైతే తమ అనుచరులు, పార్టీ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని, ఇప్పటికీ కేటీఆర్​స్పందించకపోతే మూకుమ్మడిగా బీజేపీలోకి పోవడం తప్ప తమ ముందు వేరే మార్గం లేదని కొందరు లీడర్లు మాట్లాడారు. ఈ విషయం కాస్తా మంత్రి కేటీఆర్​ దృష్టికి చేరడంతో ఆయన నష్ట నివారణ చర్యలు ప్రారంభించారు.  నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, సీనియర్లతో మాట్లాడేందుకు వారం రోజుల షెడ్యూల్​ ప్రకటించి, ఆయా రోజుల్లో హైదరాబాద్​ రావాలని ఆహ్వానం పంపారు. మంగళవారం తంగళ్లపల్లి మండలంలోని సర్పంచ్​లు, ఎంపీటీసీలు, సింగిల్​ విండో చైర్మన్లు, పార్టీ లీడర్లను ప్రగతిభవన్​కు పిలిపించుకొని మాట్లాడారు. వారు చెప్పిన సమస్యలన్నీ విని, ఇకపై తాను అందరికీ అందుబాటులో ఉంటానని, ఏ విషయమైనా లీడర్లందరి అభిప్రాయాలు తీసుకున్నాకే ముందుకెళ్తానని కేటీఆర్​ నచ్చజెప్పినట్లు తెలిసింది. ఎవరూ నారాజ్​ కావొద్దని, పార్టీ మారే ఆలోచన మనసులోకి రానివ్వొద్దని సూచించినట్లు సమాచారం. బుధ, గురువారం భోగి, సంక్రాంతి ఉండడంతో ఈ నెల 15న గంభీరావుపేట, 16న ముస్తాబాద్​, 17న ఎల్లారెడ్డిపేట, 18న  సిరిసిల్ల టౌన్, అర్బన్​ మండలాల ప్రజాప్రతినిధులు, పార్టీ లీడర్లతో భేటీ కానున్నారు. ఊహించని రీతిలో చిన్నసారు తమను ప్రగతిభవన్​కు పిలిపించి తిండిపెట్టి, సమస్యలు విని, భుజాలపై చేతులేసి భరోసా ఇవ్వడంతో సిరిసిల్లలోని టీఆర్​ఎస్​లీడర్లు ఇప్పుడు ఖుషీగా ఉన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుండడమే కేటీఆర్​లో మార్పునకు కారణమని బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. మొత్తంమీద మామిడి తోట సీక్రెట్​ మీటింగ్​వర్క్​అవుట్​ అయిందని చెప్పుకుంటున్నారు.