
- పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తుండటంతో చర్యలు
హైదరాబాద్, వెలుగు: అసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి రావి శ్రీనివాస్ను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో ఆయనపై ఆరేండ్లు సస్పెన్షన్ విధిస్తున్నట్లు పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన సమావేశమైన కమిటీ.. ఈ నిర్ణయం తీసుకుంది. వెంటనే ఇది అమల్లోకి వస్తుందని చెప్పింది.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు రావి శ్రీనివాస్ పాల్పడుతున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదుపై.. విచారణ చేసిన కమిటీ ఆయనపై చర్యలు తీసుకుంది. గతంలో జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్న సీతక్కకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఆయన పోస్టులు పెట్టారని, దీనిపై పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్కు సీతక్క ఫిర్యాదు చేసినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఇన్ చార్జ్ మంత్రిగా కూడా కొనసాగనని మీనాక్షికి చెప్పినట్టు సమాచారం.