
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తు వేగవంతంగా సాగుతోంది. విచారణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. విచారణకు రావాలంటూ 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు అందజేశారు. గతంలో ఫామ్హౌస్ కేసు నిందితులను కలిశారనే ఆరోపణలతో రఘురామకు నోటీసులు పంపినట్లు తెలుస్తోంది.
ఇక సిట్ దర్యాప్తునకు సహకరించని కీలక సూత్రధారులపై అధికారులు చర్యలకు సిద్ధమవుతున్నారు. సిట్ దర్యాప్తు విచారణకు హాజరుకాని కీలక నేతలపై కేసులు నమోదు చేస్తున్నారు. ఈ మేరకు బీజేపీ నేత బీఎల్ సంతోష్పై సిట్ అధికారులు కేసు నమోదు చేశారు. ఫామ్హౌస్ డీల్ వ్యవహారంలో.. సంతోష్తో పాటు జగ్గుస్వామి, తుషార్పై కేసులు నమోదయ్యాయి.
ఇక.. సిట్ విచారణకు బీఎల్ సంతోష్ గైర్హాజరుపై.. రెండురోజుల క్రితం హైకోర్టులో వాదనలు జరిగిన విషయం తెలిసిందే. మళ్లీ 41 సీఆర్ పీసీ నోటీసులు ఇవ్వాలని తెలంగాణ సిట్ అధికారులకు హైకోర్టు ఆదేశించింది. మళ్లీ వాట్సాప్, ఈ మెయిల్ ద్వారా నోటీసులు ఇవ్వాలని హైకోర్టు తెలిపింది. మరోవైపు ఫౌంహౌస్ కేసు నిందితుల కస్టడీ కోరుతూ సిట్ పిటిషన్ దాఖలు చేసింది.