హైదరాబాద్, వెలుగు: ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో నిందితుడైన నందకుమార్ భార్య చిత్రలేఖ, అంబర్ పేటకు చెందిన లాయర్ ప్రతాప్ గౌడ్ ను అధికారులు శుక్రవారం ప్రశ్నించారు. ఇద్దరిని వేర్వేరుగా 8 గంటల పాటు విచారించారు. ప్రధానంగా ఫిల్మ్నగర్లోని నందకుమార్కు చెందిన డెక్కన్ కిచెన్లో జరిగిన మీటింగ్స్పై ఆరా తీసినట్లు తెలిసింది. గతంలో రామచంద్రభారతి ఇక్కడే షెల్టర్ తీసుకున్నట్లు సిట్ అనుమానిస్తోంది.
ఈ క్రమంలోనే సీసీ కెమెరా ఫుటేజీ, ఫొటోల ఆధారంగా చిత్రలేఖను విచారించినట్లు తెలిసింది. అక్కడికి రామచంద్రభారతి, సింహయాజీతో పాటు ఇంకెవరు వచ్చారు? నందకుమార్తో లాయర్లు శ్రీనివాస్, ప్రతాప్గౌడ్కు ఎంతకాలంగా పరిచయం ఉంది? వీరి మధ్య ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరిగాయి? వంటి విషయాల గురించిన వివరాలు సేకరించినట్లు సమాచారం. అయితే సిట్ అధికారులు అడిగిన కొన్ని ప్రశ్నలకు చిత్రలేఖ జవాబు చెప్పలేకపోయారని తెలిసింది. అలాగే నందకుమార్ తో పరిచయం, రామచంద్ర భారతి, సింహయాజీలతో కలిసి దిగిన ఫొటోలపై కూడా ప్రతాప్ గౌడ్ను సిట్ ప్రశ్నించినట్లు సమాచారం. వీళ్లిద్దరినీ సోమవారం మరోసారి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. కాగా, ఈ కేసులో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజీలను ఏసీబీ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. నిందితులకు డిసెంబర్ 9 వరకు రిమాండ్ పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.