భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులకు బుధవారం ప్రాకార మండపంలో అర్చకులు స్నపన తిరుమంజనం నిర్వహించారు. గర్భగుడిలో మూలవరులకు సుప్రభాత సేవ చేసి బాలబోగం నివేదించాక.. ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ప్రాకార మండపానికి తీసుకెళ్లారు. అక్కడ ముందుగా విశ్వక్షేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన తర్వాత పంచామృతాలతో అభిషేకం చేశారు.
సమస్త నదీజలాలు, సహస్రధారలతో తిరుమంజనం జరిపించారు. భక్తులకు అభిషేక జలాలను పంపిణీ చేశారు. కల్యాణమూర్తులను బేడా మండపానికి తీసుకొచ్చి నిత్య కల్యాణం నిర్వహించారు. భక్తులు కంకణాలు ధరించి క్రతువులో పాల్గొన్నారు. అనంతరం మాధ్యాహ్నిక ఆరాధనలు నిర్వహించి సీతారామయ్యకు రాజబోగం నివేదించారు. సాయంత్రం స్వామికి దర్బార్ సేవ జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
