
కారేపల్లి, వెలుగు: సీఎం కేసీఆర్ను విమర్శిస్తూ ఫొటోను వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేసిన ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లికి చెందిన జనగంటి అర్జున్ అనే యువకుడు ఓ వాట్సాప్ గ్రూపులో కేసీఆర్ను అవమానించేలా ఫొటో పోస్ట్ చేశాడు. ఆ గ్రూపులోనే ఉన్న కారేపల్లికి చెందిన హట్కర్ రాంబాబు అనే మరో యువకుడు ఖమ్మంకు చెందిన మరో వ్యక్తికి ఫార్వర్డ్ చేశాడు. ఆ ఫొటోను చూసిన కారేపల్లి మండల టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి అజ్మీర వీరన్న కారేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. జనగంటి అర్జున్, హట్కర్ రాంబాబు, ఖమ్మం రూరల్ మండలం గొల్లపాడుకు చెందిన పొన్నెకంటి సురేశ్, గార్ల మండలం కొత్తపోచారానికి చెందిన కొండమీది కోటేశ్వరావు, తిరుమలాయపాలేనికి చెందిన నేలమర్రి నారాయణ, నేలమర్రి నాగేంద్రయ్యలను అరెస్ట్ చేశారు. వారిని ఇల్లందు కోర్టులో హాజరుపరిచారు.