
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ కుటుంబంలో ఆరుగురికి కరోనా వైరస్ సోకింది. తన తండ్రి సహా ఆరుగురు ఈ మహమ్మారి బారినపడ్డారని ఆయన చెప్పారు. అందులో నలుగురు డాక్టర్లేనని తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కర్నూలులో వైరస్ కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ దశలోకి వచ్చేసిందని చెప్పారాయన. ఎవరి నుంచి ఎవరికి వైరస్ సోకుతోందో తెలియడం లేదని అన్నారు. లాక్ డౌన్ ఉన్నా కూడా ఉపయోగం లేకుండా పోయిందన్నారు. వైరస్ ను ఆపడం ఎవరితరం కావడం లేదని అన్నారు. తమ కుటుంబంలో అందరూ ప్రభుత్వ కోవిడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు ఎంపీ సంజీవ్ కుమార్. అయితే ఈ వైరస్ గురించి భయపడాల్సిందేమీ లేదని, శరీరంలో ఇమ్యూనిటీ ఉంటే కరోనా నుంచి బయటపడొచ్చని అన్నారు.
ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1097కు చేరింది. అందులో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 279 మంది వైరస్ బారినపడ్డారు. ఆ తర్వాత గుంటూరులో 214, కృష్ణా జిల్లాలో 177, చిత్తూరులో 73, నెల్లూరులో 72 కరోనా కేసుల నమోదయ్యాయి.