
దుండిగల్, వెలుగు: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ ఏరియాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన కొడుకు(6)ను స్కూటీపై స్కూల్కు తీసుకెళ్తుండగా వారిని టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మరణించాడు. తల్లి స్వల్ప గాయాలతో బయటపడింది. అయితే, కన్న కొడుకును కండ్ల ముందే కోల్పోయిన ఆ తల్లి.. రోడ్డుపైనే గుండెలవిసేలా రోదించడం అందరినీ కలిచివేసింది.
నిజామాబాద్ జిల్లాకు చెందిన రాజు దంపతులు.. దుండిగల్ పరిధిలోని మల్లంపేట ఆకాశ్ లేఅవుట్లో నివాసిస్తున్నారు. వారి కొడుకు హిమాన్షు రెడ్డి బౌరంపేటలోని గీతాంజలి స్కూల్లో ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు. రోజులాగే శుక్రవారం ఉదయం కూడా హిమాన్షును స్కూల్లో దించడానికి అతని తల్లి స్కూటీపై బయలుదేరింది.
మల్లంపేటలోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద వారి స్కూటీని టిప్పర్ వెనక నుంచి ఢీ కొట్టింది. దాంతో హిమాన్షు టిప్పర్ వెనుక చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లి స్వల్పగాయాలతో బయటపడింది. క్షణాల్లో కండ్లముందే కన్న కొడుకు చనిపోవడంతో ఆ తల్లి గుండెలవిసేలా రోదించింది. ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు..ఘటనాస్థలానికి చేరుకున్నారు. హిమాన్షు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.