ప్రియుడితో కలిసి భర్త హత్యకు స్కెచ్

ప్రియుడితో కలిసి భర్త హత్యకు స్కెచ్

షాద్ నగర్, వెలుగు: కొత్తూరులోని ఇన్మల్ నర్వలో ఈ నెల 16న జరిగిన మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. ప్రియుడి మోజులో పడి ఇస్మాయిల్ ని అతడి భార్యే చంపినట్టు పోలీసులు తేల్చారు. ఇస్మాయిల్ భార్యతో పాటు ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు. సోమవారం కొత్తూరు పీఎస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రూరల్ సీఐ రామకృష్ణ కేసు వివరాలు చెప్పారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఇన్ముల్ నర్వ గ్రామానికి చెందిన మహ్మద్ ఇస్మాయిల్(23) దర్గాలో కూలీ పనిచేసేవాడు. ఇస్మాయిల్ భార్య అనీస్ బేగం(19) నిండు గర్భిణి.  అనీస్ బేంగకు ఇస్మాయిల్ తో పెళ్లి జరగకముందు నుంచే  బహుదూర్ పురకి చెందిన సయ్యద్ జహీర్(25 )తో సంబంధం ఉంది.

అనీస్ బేగం, జహీర్ ఒకరికొకరు ప్రేమించుకున్నారు. అనీస్ బేగంకి ఇస్మాయిల్ తో పెళ్లయిన తర్వాత కూడా ఆమె సయ్యద్ తో సంబంధాన్ని కొనసాగించింది. దీంతో ఇస్మాయిల్ అడ్డుతొలగించుకోవాలని అనీస్ బేగం..ప్రియుడు జహీర్ తో కలిసి మర్డర్ స్కెచ్ వేసింది. ఈ నెల 16న సాయంత్రం సయ్యద్ జహీర్ బైక్ పై ఇన్ముల్ నర్వ గ్రామానికి వచ్చాడు.  తన భార్య అనీస్ బేగంకి తెలిసిన వ్యక్తిగా ఇస్మాయిల్ కు జహీర్ తో పరిచయం ఉంది. ఇస్మాయిల్ ను బైక్ పై ఎక్కించుకున్న జహీర్ రాత్రి 7.30గంటల ప్రాంతంలో గ్రామ శివారులోని వీవీఆర్ వెంచర్ దగ్గరికి తీసుకెళ్లాడు. అక్కడ జహీర్.. ఇస్మాయిల్ కు మద్యం తాగించాడు. ఆ తర్వాత తాగిన మైకంలో ఉన్న ఇస్మాయిల్ పై సయ్యద్ జహీర్ తన వెంట తెచ్చుకున్న బ్యాట్ తో అతడి తలపై కొట్టి చంపాడు. బుధవారం గ్రామ శివారులో ఇస్మాయిల్ డెడ్ బాడీ ఉందన్న సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. షాద్ నగర్ ఏసీపీ సుందర్ ఆధ్వర్యంలో పోలీసులు బృందాలుగా విడిపోయి హంతకుల కోసం గాలించారు.

ఈ దర్యాప్తులో భాగంగా అనీస్ బేంగను విచారించిన పోలీసులు ఆమె కాల్ లిస్ట్ ఆధారంగా వివరాలు సేకరించారు. ఇస్మాయిల్ హత్య చేసింది ఆమె ప్రియుడు సయ్యద్ జహీర్ గా గుర్తించి అతడిని  అదుపులోకి తీసుకున్నారు. ఇస్మాయిల్ ను తానే చంపినట్టు జహీర్ విచారణలో ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. నిందితుల దగ్గరి నుంచి 2 సెల్​ఫోన్లు, హత్య కోసం వాడిన బ్యాట్ ను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్టు సీఐ రామకృష్ణ చెప్పారు. మీడియా సమావేశంలో ఎస్సై కృష్ణ, స్పెషల్ పోలీస్ టీమ్ సిబ్బంది శేఖర్, రవీందర్, శివకుమార్ పాల్గొన్నారు.