ఈటలకు స్వల్ప అస్వస్థత..పాదయాత్రకు అంతరాయం

ఈటలకు స్వల్ప అస్వస్థత..పాదయాత్రకు అంతరాయం

ప్రజా దీవెన యాత్రలో భాగంగా మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ చేపట్టిన పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా 12వ రోజు ఇవాళ ఈటల హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని పోతిరెడ్డిపల్లి, కొండపాక గ్రామాల్లో పర్యటించారు. పాదయాత్ర కొనసాగుతుండగానే వీణవంక మండలం కొండపాక దగ్గర ఈటల స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. జ్వరం రావడంతో ప్రత్యేక బస్సులో ప్రాథమిక చికిత్స అందించారు. ఈటల కాళ్లకు పొక్కులు రావడం, తీవ్ర అలసట, గొంతు బొంగురు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని.. మెరుగైన వైద్యం కోసం ఈటలను హైదరాబాద్‌ తరలించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

కోలుకోగానే ఎక్కడైతే పాదయాత్ర ఆగిపోయిందో అక్కడి నుంచే ఈటల పాదయాత్ర ప్రారంభిస్తారని మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి తెలిపారు. ఈటల పాదయాత్ర కోసం ఎదురు చూస్తున్న ప్రజలు సహకరించాలన్నారు.