ఆస్ట్రేలియాపై ఇండియా విమెన్స్​ టీమ్​ థ్రిల్లింగ్ విక్టరీ

ఆస్ట్రేలియాపై ఇండియా విమెన్స్​ టీమ్​ థ్రిల్లింగ్ విక్టరీ

నవీ ముంబై: స్మృతి మంధాన సెన్సేషనల్​ బ్యాటింగ్​తో చెలరేగడంతో ఆస్ట్రేలియాపై ఇండియా విమెన్స్​ టీమ్​ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది.  ఆదివారం జరిగిన రెండో టీ20లో సూపర్​ ఓవర్​లో  ఆసీస్​ను ఓడించి ఐదు మ్యాచ్​ల సిరీస్​ను 1–1తో సమం చేసింది. ఈ ఏడాది ఆసీస్​కు తొలి ఓటమి రుచి చూపెట్టింది.  సూపర్​ ఓవర్​లో ఇండియా  20/1  రన్స్​ చేసింది. రిచా ఘోష్​ సిక్స్, మంధాన సిక్స్​, ఫోర్​తో చెలరేగింది. తర్వాత ఆసీస్​ 16/1 స్కోరుకే పరిమితమైంది. హీలీ రెండు ఫోర్లు, సిక్స్​ కొట్టినా టీమ్​ను గెలిపించలేకపోయింది.

అంతకుముందు టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 187/1 స్కోరు చేసింది. నాలుగో ఓవర్​లోనే అలీసా హీలీ (25) ఔటైనా... బెత్​ మూనీ (54 బాల్స్​లో 13 ఫోర్లతో 82 నాటౌట్​), తాహ్లియా మెక్​గ్రాత్​ (51 బాల్స్​లో 10 ఫోర్లతో 1 సిక్స్​తో 70 నాటౌట్​) దంచికొట్టారు. మిడిల్​ ఓవర్స్​లో ఇండియా బౌలర్లు ఫెయిల్​ కావడంతో చెలరేగి ఆడిన మూనీ, మెక్​గ్రాత్​ రెండో వికెట్​కు159 రన్స్​ జత చేశారు. ఇండియా బౌలర్లలో దీప్తి శర్మ ఒక్క వికెట్​ తీసింది. టార్గెట్​ ఛేజింగ్​లో ఇండియా 20 ఓవర్లలో కూడా 187/5 స్కోరు చేసింది. స్మృతి మంధాన (49 బాల్స్​లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 79), షెఫాలీ వర్మ (34), రిచా ఘోష్​ (26 నాటౌట్​), హర్మన్​ప్రీత్​ కౌర్​ (21) రాణించారు. ఇండియా విజయానికి ఆఖరి బాల్​కు ఐదు రన్స్​ కావాల్సిన దశలో దేవికా వైద్య (11 నాటౌట్​) ఫోర్​ కొట్టడంతో మ్యాచ్​ టై అయ్యింది.  దీంతో సూపర్​ ఓవర్​ అనివార్యమైంది. హీథర్​ గ్రాహమ్​ 3 వికెట్లు తీసింది. స్మృతికి ‘ప్లేయర్​ ఆఫ్​ ద మ్యాచ్​’ అవార్డు లభించింది. మూడో మ్యాచ్​ బుధవారం జరుగుతుంది.